గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం: PMVVY స్కీం మరో మూడేళ్లు పొడిగింత
సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్. ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) పెన్షన్ పథకాన్ని మార్చి 31, 2023 వరకు పొడిగించారు. ఈ స్కీం కాలపరిమితి మార్చి 31, 2020తో ముగిసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీనిని మరో మూడేళ్లు పొడిగించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ జనరల్ డైరెక్టర్ కేఎస్ ధత్వాలియా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి వయవంద యోజన పథకాన్ని 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ట్వీట్లో పేర్కొన్నారు. వయో వృద్ధులకు ఇది భద్రతతో కూడిన సంక్షేమ పథకమని తెలిపారు.
ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్, వారికి ఊరట: ఎందుకు ఇలా చేసింది?
వడ్డీ రేటు ఎంత అంటే?
ప్రధాని వయ వందన యోజన పెన్షన్ పథకాన్ని 31 మార్చి 2023 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 7.40 శాతంగా నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యథాతథంగా ఉంటాయి.
వైద్య పరీక్షలు అవసరం లేదు..
వయ వందన యోజన స్కీంను లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆఫర్ చేస్తోంది. పదేళ్ల పాటు నిర్ణీత రేటుకు పెన్షన్ చెల్లించే హామీని కలిగి ఉంటుంది. నామినీకి డెత్ బెనిఫిట్స్ ఉన్నాయి. 60 ఏళ్లు పైబడిన లేదా పదవీ విరమణ అనంతరం ఆదాయం గురించి చింత లేకుండా ఉండేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. వృద్ధులకు ఆసరాగా నిలిచే పథకం ఇది. పదేళ్ల కాల పరిమితికి వర్తించే ఈ పథకంలో చేరే వృద్ధులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
పాలసీ కొనుగోలు చేయడానికి ఇవి అవసరం
ఈ పాలసీని కొనుగోలు చేయడానికి వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా అవసరం. ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేసే ఈ పథకంలో వడ్డీని 8.3 శాతంగా నిర్ణయించారు. నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్సన్ అందుతుంది. అత్యవసర వైద్య సహాయానికి లేదా అరోగ్య సమస్యలకు డబ్బు అవసరమైనప్పుడు ఈ పాలసీని స్వాధీనపరిచి డబ్బు పొందే వీలు ఉంది. జీవిత భాగస్వామి అవసరాలకు కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది.