ఈసారికి ఊరట, వచ్చే దీపావళి నాటికి బంగారం ధరలు భారీ షాక్!
2019లో మందగమనం, ఆ తర్వాత ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి కారణంగా జ్యువెల్లరీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుత పండుగ సీజన్ కారణంగా డిమాండ్ పుంజుకుంటోంది. దీనికి తోడు పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే రూ.8500కు పైగా తక్కువగా ఉండటం, అలాగే గత ఏడాది ఇదే సీజన్తో పోల్చినా తక్కువగా ఉన్నాయి. ఇది కలిసి వస్తోంది. ఎకనమిక్ సెంటిమెంట్ బుల్లిష్గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధనతెరాస్ సమయంలో ఈసారి గోల్డ్ జ్యువెల్లరీ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి దిగుమతులు కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. ధరలు తగ్గితే, డిమాండ్ మరింత పుంజుకుంటుందని, అప్పుడు మరో 740 టన్నుల బంగారం దిగుమతులు అవసరమవుతాయనే అంచనాలు ఉన్నాయి.
పసిడి విక్రయాల్లో వృద్ధి అందుకే
ఈసారి దీపావళికి పసిడి మరింత మెరుగు అవుతుందని, కరోనా ముందు స్థాయితో పోలిస్తే 30 శాతం వృద్ధితో విక్రయాలు నమోదు కావొచ్చునని జ్యువెల్లరీ మార్కెట్ ఆశిస్తోంది. ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా రికవరీ అవుతుండడం, ధరలు తక్కువగా ఉండడంతో డిమాండ్ భారీగా పెరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది దీపావళి, ధనతెరాస్ సమయంలో రత్నాభరణాల పరిశ్రమ విక్రయాలు దాదాపు లేవని చెప్పవచ్చు. 2021 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికం నుండి పసిడి విక్రయాల్లో వృద్ధి నమోదవుతూ వస్తోంది. పది గ్రాముల బంగారం రూ.42,500కు తగ్గడం వల్ల ఇది సాధ్యైందని చెబుతున్నారు. దీనికి ఆర్థిక రికవరీ కలిసి వచ్చింది.
పండుగలు, పెళ్లిళ్లు
కరోనా సమయంలో వాయిదా పడిన పెళ్లిళ్లు ఈ ఏడాది ఉండటం కలిసి వచ్చింది. పండుగలకు ఇది తోడు. ఓ సమయంలో రూ.56,200కు చేరిన బంగారం ఇపుడు రూ.50,000 దిగువన ఉంది. వ్యాక్సీనేషన్, కరోనా కేసులు తగ్గడం ఆర్థిక రికవరీకి కలిసి వచ్చింది. దీంతో ఈ ఏడాది చివరి నాటికి జ్యువెల్లరీ సేల్స్ మరింత పెరుగుతాయని, 2019తో పోలిస్తే 20-25 శాతం నమోదుకావొచ్చని భావిస్తున్నారు. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ పైన పెట్టుడులు పద్దెనిమిది శాతం పెరిగాయి. గోల్డ్ జ్యువెల్లరీ డిమాండ్ కూడా 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. ఈసారి వృద్ధి గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వరకు ఉండవచ్చునని అంటున్నారు.
వచ్చే దీపావళి నాటికి షాక్
గత ఏడాది దీపావళి నుండి ఇప్పటి వరకు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే మళ్లీ ఔన్స్ ధర 2000 డాలర్లకు చేరుకోవచ్చునని, దేశీయంగా వచ్చే పన్నెండు నెలల కాలంలో రూ.52,000 నుండి రూ.54,000కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ దీపావళికి బంగారం ధరలు బంగారం ధరలు రూ.50,000కు దిగువనే కనిపిస్తున్నాయి.
వచ్చే దీపావళి వరకు మధ్యలో బంగారం ధరలకు రూ.42,500 వద్ద బలమైన మద్దతు కనిపిస్తోందని, ఈ స్థాయి దిగువకు పడిపోతే రూ.35,700 వద్ద మద్దతు కనిపిస్తోందని అంటున్నారు.