బంగారం@రూ.1,00,000?: బంగారాన్ని కొందామా, వచ్చే ఐదేళ్లలో రెండింతలు
కరోనా నేపథ్యంలో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఏకంగా ఆల్ టైమ్ గరిష్టం రూ.56200 తాకిన గోల్డ్ ఫ్యూచర్స్, ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్కు ముందు రూ.44,000 దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం రూ.48,000 వద్ద కదలాడుతున్నాయి. గత ఏడాది ఆగస్ట్ నుండి ఈ ఏడాది ఆగస్ట్ వరకు గోల్డ్ ఫ్యూచర్స్ రూ.12000 మధ్య కదలాడాయి.
ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8000 తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చునా, ఏ మేరకు రిటర్న్స్ వస్తాయని చాలామందిలో ఉండవచ్చు. స్వల్పకాలంలో బంగారంపై పెట్టుబడికి ఆచితూచి వ్యవహరించాలని, దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
బంగారంపై పెట్టుబడి...
భారతదేశంలో బంగారం ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా మహిళలు ఆభరణాలు ధరిస్తారు. పురుషులు కూడా ధరిస్తారు. ఇదివరకు కేవలం ఆభరణంగా మాత్రమే భావించిన ఈ పసిడి, క్రమంగా పెట్టుబడి సాధనంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారం ధరించడం కంటే పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. కరోనాకు ముందు రూ.40వేల దిగువన ఉన్న బంగారం ఇప్పుడు రూ.50వేల దిశగా పరుగు పెడుతోంది. గత ఏడాది ఇదే సమయంలో అయితే ఏకంగా రూ.56000 దాటింది. కాబట్టి లాంగ్ టర్మ్లో బంగారంపై పెట్టుబడి ప్రయోజనకరంగా ఎక్కువమంది విశ్వసిస్తున్నారు.
వచ్చే 3-5 ఏళ్లలో రెండింతలు
బంగారం ధరలు రానున్న మూడు నుండి అయిదేళ్ల కాలంలో ప్రస్తుతం ఉన్న ధరకు రెండింతలు కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు క్వాడ్రిగా ఇగ్నియో ఫండ్ మేనేజర్ డియోగో పారిల్లా బంగారం ధరల వృద్ధిపై ఆశాజనకంగా ఉన్నారు. వచ్చే మూడు నుండి అయిదేళ్ల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 3వేల డాలర్ల నుండి 5వేల డాలర్లకు పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
కరోనా కారణంగా కేంద్ర బ్యాంకులు భారీగా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాయని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కాబట్టి రానున్న కాలంలో పసిడి ధర పరుగులు పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. అంటే మన వద్ద రూ.90వేల నుండి అంతకు పైన పెరుగుతుందని భావించవచ్చు.
ప్రతికూల పరిస్థితుల్లో...
గత ఏడాది ఆగస్ట్ నెలలో కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 2075 డాలర్లను తాకిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 1800 డాలర్ల వద్దకు చేరుకుంది. తాత్కాలికంగా లేదా కృత్రిమ తక్కువ వడ్డీ రేట్లు ఇతర సాధనాల్లో పెట్టుబడికి అవకాశంగా కనిపించాయని, కానీ ఇవి ఎప్పుడైనా పడిపోవచ్చునని చెప్పారు. ఇది కేంద్ర బ్యాంకులకు కూడా సవాల్ అని అభిప్రాయపడ్డారు.
గతంలోనే ఊహించినట్లుగా...
గతంలోను బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటాయని అంచనా వేశారు. వచ్చే అయిదేళ్లలో బంగారం సరికొత్త రికార్డులు సృష్టించనుందని 2016లో చెప్పారు. చెప్పినట్లుగానే కరోనా కారణంగా బంగారం రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి పసిడిపై తన అంచనాలు వెల్లడించారు. వచ్చే మూడు నుండి అయిదేళ్లలో మూడువేల డాలర్ల నుండి ఐదువేల డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.
1700 డాలర్లకు పతనమై...
రాబోయే కొన్నేళ్లలో బంగారం నిల్వలు క్రమంగా తగ్గిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా తర్వాత రికవరీ, ఫెడ్ టాపేరింగ్, బలమైన డాలర్ వంటి అంశాలు పసిడిపై ఒత్తిడిని పెంచవచ్చునని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ క్యాలెండర్ ఏడాది చివరి నాటికి బంగారం 1700 డాలర్లకు పడిపోవచ్చునని, 2022 ఏడాదిలోను మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని యూబీఎస్ గ్రూప్ ఏజీ స్ట్రాటెజిస్ట్స్ చెబుతున్నారు. అయితే దీర్ఘకాలంలో మాత్రం మంచి రాబడులు ఇస్తాయని అంటున్నారు.