మళ్లీ తగ్గిన ప్రీమియం, రిటైలర్లకు దసరా జోష్.. దీపావళి రెడీ
గతవారం ఔన్స్కు 5 డాలర్లుగా ఉన్న గోల్డ్ ప్రీమియం ఈసారి 1 డాలర్కు తగ్గింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలకు తోడు దిగుమతి సుంకం 12.5 శాతం, 3 శాతం జీఎస్టీ ఉంటుంది. గతవారం ప్రీమియం 5 డాలర్లుగా ఉండగా, అంతకుముందు వారం 1 డాలర్గా ఉంది. దీపావళి, ధన్తెరాస్ సందర్భంగా బంగారం కొనుగోలును శుభప్రదంగా భావిస్తారు. బంగారం ధరలు ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. ఆ తర్వాత ధరలు భారీగా తగ్గాయి. గత నెల రోజులకు పైగా పసిడి ధరలు రూ.49,500 నుండి రూ.51,000 మధ్య కాస్త స్థిరంగా కదులుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం నుండి ధరలు తగ్గడం, గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉండటంతో ఈ పండుగ సీజన్లో వ్యాపారం పెరుగుతుందని బంగారం వ్యాపారులు భావిస్తున్నారు. ధరలు స్థిరంగా ఉండటం కొనుగోలుదారుల సెంటిమెంట్ను బలపరిచింది.
పండుగకు ముందే ప్యాకేజీ! ఈ రంగాలకు కేంద్రం భారీ ఊరట
విశ్వాసం నింపిన దసరా
దసరా అమ్మకాలు జ్యువెల్లరీ వ్యాపారులకు కాస్త విశ్వాసాన్ని నింపాయని, సేల్స్ కాస్త సానుకూలంగా కనిపించాయని, ఇప్పుడు దీపావళి కోసం కొనుగోళ్లు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. బంగారం రిటైల్ కొనుగోలుదారులు క్రమంగా స్థానిక ధరలకు అలవాటు పడుతున్నారని చెబుతున్నారు. అయితే కమర్షియల్ ఫ్లైట్స్ పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. దీంతో షిప్పింగ్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. బంగారం ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పటికీ సింగపూర్ వంటి ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం లేదు.
ఓవర్సీస్ నుండి కూడా డిమాండ్
భారత జ్యువెల్లరీ వ్యాపారులకు ఓవర్సీస్ నుండి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దుబాయ్, చైనా నుండి క్లయింట్స్ కొనుగోలు చేస్తారు. చైనాలో గతవారం 30 డాలర్ల నుండి 32 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చారు. అంతకుముందు వారం ఇది 30 డాలర్ల నుండి 33.5 డాలర్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో చైనా డిస్కౌంట్లో స్వల్ప తేడా మాత్రమే ఉంది.
గతవారం పసిడి ధరల ముగింపు
అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 1900 డాలర్ల పైన ప్రారంభమైన బంగారం ధరలు, ఈ వారంలో ఈ మార్క్ కంటే కిందకు దిగివచ్చాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గతవారం పసిడి ధరల్లో పెద్దగా మార్పులేదు. శుక్రవారం 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400కు పైగా పెరిగి రూ.50,700 వద్ద ముగిసింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం రూ.444 (0.88 శాతం) ఎగిసి రూ.50.808 వద్ద ముగిసింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో రూ.748 (1.24 శాతం) పెరిగి రూ.60,920 వద్ద, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.721 (1.17 శాతం) పెరిగి రూ.62,455 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1880 డాలర్ల దిగువకు వచ్చింది. చివరి సెషన్లో 0.57 శాతం పెరిగి 1878.70 డాలర్లు పలికింది. ఏడాదిలో 22 శాతం మేర పెరిగింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ క్రితం 23.710 డాలర్ల వద్ద ముగిసింది.