కరోనా రక్షక్, కరోనా కవచ్: రూ.50వేల నుండి రూ.5 లక్షల వరకు పాలసీలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఇన్సురెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ (IRDAI) కరోనా పాలసీలు తీసుకు రావాలని బీమా కంపెనీలను ఆదేశించింది. వచ్చే నెల 10వ తేదీ వరకు స్వల్పకాలిక కరోనా స్టాండర్ట్ ఆరోగ్య బీమా లేదా కరోనా కవచ్ పాలసీలను తేవాలని జనరల్, ఆరోగ్య బీమా సంస్థలకు సూచించింది. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల్లో ఈ పాలసీలు అందుబాటులో ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
రూ.50వేల నుండి రూ.5 లక్షల వరకు పాలసీ
కరోనా స్టాండర్డ్ హెల్త్ పాలసీ శ్రేణి రూ.50వేల నుండి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీల పేరులో కరోనా కవచ్ పాలసీ, కరోనా రక్షక్ పాలసీ తప్పక ఉండాలని తెలిపింది. ప్రాంతాలు, జోన్లతో సంబంధం లేకుండా దేశమంతా ఒకేలా ఉండాలని, ఒకేసారి ప్రీమియం చెల్లించేలా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆసుపత్రి ఖర్చులు, ఇంట్లోనే చికిత్స చేసుకుంటే అయ్యే వ్యయాలు, ఆయుష్ చికిత్స ఖర్చులు, ఆసుపత్రులకు చేరకముందు అయ్యే ఖర్చులు పాలసీ పరిధిలోకి తీసుకోవాలని తెలిపింది.
అందుకే కొత్త పాలసీలు..
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పాలసీల ద్వారా కరోనాకు కవరేజీ లభిస్తోంది. అయితే పాలసీదారు ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేరి కనీసం 24 గంటలు ఉంటే కవరేజీ వర్తిస్తుంది. అంతేకాకుండా కరోనా సంక్రణను నిరోధించేందుకు ఉపయోగించే పీపీఈ క్విట్, గ్లౌజ్, మాస్క్ ఖర్చులను బీమా కంపెనీలు చెల్లించడం లేదు. మరోవైపు స్వల్ప లక్షణాలు ఉంటే ఇంటి వద్దే చికిత్స తీసుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. వీరికి కవరేజీ లభించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అవసరాల దృష్ట్యా కరోనా పాలసీలు తీసుకు రావాలని IRDAI ఆదేశించింది.
కవరేజీ
బీమాసంస్థలు 18 ఏళ్ల నుండి కనీసం 65 ఏళ్ల వారికి కవరేజీ అందించాల్సి ఉంటుంది.
బీమా కంపెనీలు జూలై 10 నుండి కరోనా కవచ్, కరోనా రక్షక్ పథకాలు అందించాలి.
కరోనా పాలసీ కాలపరిమితి 3.5 నెలల నుండి 9.5 నెలల వరకు ఉంటుంది.
కరోనా కవచ్ పాలసీ రూ.50,000 నుండి రూ.5,00,000 వరకు ఉంటుంది.
హెల్త్ వర్కర్స్కు 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది.
అవసరమైన సమయంలో కోవిడ్ బీమా ఉత్పత్తులు తీసుకు రావాలని రెగ్యులేటరీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారతీ ఆక్సా జనరల్ ఇన్సురెన్స్ చీఫ్ అండర్ రైటింగ్ అండ్ రీఇన్సురెన్స్ ఆఫీసర్ మిలింద్ వి కోల్హె అన్నారు.