ధరల పెరుగుదల నుండి క్యాష్ వోచర్ వరకు: ఏప్రిల్ 1 నుండి ఈ మార్పులు తప్పనిసరి
మార్చి 31 తేదీ తర్వాత.. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి చాలా మార్పులు ఉంటాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుండి ఐటీఆర్ ఫైలింగ్ వరకు చాలా మార్పులు ఉంటాయి. ఏసీలు, టీవీల ధరలు పెరగనున్నాయి. కార్లు, బైక్స్ ధరలు కూడా షాకివ్వనున్నాయి. విమాన ప్రయాణం పైన కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇలా చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎస్సెమ్మెస్ నిబంధనలు తప్పనిసరి
వాహనాలు, ఏసీలు, బైక్స్ ధరలు పెరగొచ్చు
కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు, బైక్స్ ధరలు పెరగనున్నాయి. పలు కంపెనీలు జనవరిలో ఇప్పటికే రేట్లు పెంచాయి. అంతర్జాతీయ సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్స్ సంస్థలు రేట్లు పెంచుతున్నాయి. టీవీలు, ఏసీల ధరలు మూడువేల రూపాయల నుండి రూ.6వేల రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజరేటర్ల ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఏసీ ధరలు రూ.1500 నుండి రూ.2000 వరకు పెరగవచ్చు.
విమానాశ్రయాల్లో ధరల వాత
ఏప్రిల్ నుండి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించవలసి రావొచ్చు. విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ASF) పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులపై ASFను పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ఈ రేటు ఉంటుంది.
ఎల్టీసీ క్యాష్ వోచర్
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంకు చివరి గడువు మార్చి 31. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా పండుగ సీజన్లో డిమాండ్ పెంచేందుకు ఆర్థిక శాఖ ఈ ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నాన్-సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సహా పలువురికి దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఎల్టీసీ వోచర్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 12 శాతం లేదా ఆ పైన జీఎస్టీ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అది కూడా డిజిటల్ రూపంలో ఉండాలి. అక్టోబర్ 12, 2020 నుండి మార్చి 31, 2021 లోపు ఎల్టీసీ క్యాష్ వోచర్ను వినియోగించాలి. అయితే ఎల్టీసీ వోచర్కు మూడు రెట్ల ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.50వేల వోచర్కు అర్హులు అనుకుంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. జీఎస్టీ నెంబర్, జీఎస్టీ వివరాలు తెలియజేయాలి.