BoB పవర్ ఆఫ్ జన్ ధన్: జన్ ధన్ ప్లస్ ఫీచర్ను స్వీకరిస్తే...
పవర్ ఆఫ్ జన్ ధన్ పేరుతో భారతదేశంలో మహిళలకోసం ఫైనాన్స్ వర్కింగ్ మేకింగ్ను విడుదల చేసింది వుమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్. ఇది లాభాపేక్ష లేని సంస్థ. అల్పాదాయం కలిగిన మహిళలకు ఆర్థిక భద్రత, శ్రేయస్సు కోసం సహకరిస్తుంది. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) భారత అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటి. ఇవి పవర్ ఆఫ్ జన్ ధన్ను విడుదల చేశాయి. రీసెర్చ్ ప్రకారం భారతదేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 100 మిలియన్ల అల్పాదాయం కలిగిన భారతీయ మహిళల ఖాతాల్లో రూ.25,000 కోట్లను కలిగి ఉన్నాయి. తక్కువ ఆదాయం కలిగిన మహిళలకు, వారి కుటుంబాల ఆర్థికస్థితిస్థాపకతను పెంపొందించేందుకు, శక్తివంతమైన సాధనంగా పొదుపు ప్రాముఖ్యతను జన్ ధన్ తెలియజేస్తుందని నివేదిక తెలిపింది.
ప్రభుత్వం 2014లో జన్ ధన్ను ప్రారంభించిందని, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రభుత్వానికి ఫ్లాగ్షిప్గా మారిందని పేర్కొంది. గ్లోబల్ ఫైండెక్స్ నివేదిక 2017 ప్రకారం 77 శాతం మంది మహిళలు, 83 శాతం మంది పురుషులు భారత దేశంలో సొంత అకౌంట్ను కలిగి ఉన్నారు. జన్ ధన్ ఖాతా ద్వారా పురుషులు, మహిళల మధ్య అకౌంట్ ఓనర్షిప్ 6 శాతానికి పడిపోయింది. 2014లో ఇది 20 శాతంగా ఉంది. నేడు 23.73 కోట్ల మహిళా జన్ ధన్ అకౌంట్స్ ఉన్నాయి. అయితే బ్యాంకు అకౌంట్ తీసినంత మాత్రాన యాక్టివ్గా ఉపయోగపడున్నట్లు కాదని కూడా బీవోబీ నివేదిక పేర్కొంది.
వుమెన్స్ వరల్డ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళా జన్ ధన్ కస్టమర్లలో ఖాతా వినియోగాన్ని పెంపొందించడానికి లేదా ప్రోత్సహించేందుకు ప్రత్యేక పైలట్ ప్రోడక్ట్ను రూపొందించాయి. జన్ ధన్ ప్లస్ అనేది నాలుగు నెలల పాటు రూ.500 డిపాజిట్ను ప్రోత్సాహక పరిష్కారం. దీంతో ప్రతి ఖాతాదారు రూ.10,000 క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందగలుగుతారు. దీంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మహిళా ఖాతాదారులు బ్యాంకుకు మరింత దగ్గరవుతారు. నైపుణ్యాలు పెరుగుతాయి. విశ్వాసిస్తారు. ఈ అకౌంట్స్ ద్వారా సేవింగ్స్ ఆలోచనను పెంపొందించుకోవడంతో పాటు వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంది.
జన్ ధన్ ప్లస్ను పైలట్ ప్రాజెక్టుగా 101 బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీల్లో నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై తదితర 300కి పైగా బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్స్లో ఫిబ్రవరి 2020 నుండి ఆగస్ట్ 2020 మధ్య పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ కాలంలో దాదాపు 50,000 మంది మహిళలు, పురుషులు జన్ ధన్ ప్లస్కు సైన్-ఇన్ అయ్యారు. ఈ పథకం ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో 32 శాతం మంది మహిళా ఖాతాదారులు బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్స్ను సందర్శించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి జన్ ధన్ ప్లస్ ద్వారా తాము మహిళల పొదుపు ప్రవర్తన, అవగాహనలను సునిశితంగా అధ్యయనం చేయగలిగామని, ఇది వారి ప్రత్యేక అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తిని రూపొందించడానికి వెసులుబాటు కల్పించిందని వుమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ (ఏసియా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామన్ జగన్నాథన్ అన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు జన్ ధన్ ప్లస్ ఫీచర్ను స్వీకరిస్తే అది మహిళలకు పొదుపు అలవాటుగా మార్చే ఉత్పత్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు.