బ్యాంకు డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.5 లక్షలు, 90 రోజుల్లోనే రీఫండ్
బ్యాంకు డిపాజిట్ ఇన్సురెన్స్ కవర్ను కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం డిపాజిటర్స్ ఫస్ట్ అనే కార్యక్రమంలో మాట్లాడారు. బ్యాంకులు దివాలా తీసినా, నష్టాల్లో నడుస్తున్నా డిపాజిటర్ల సొమ్ములో రూ.5 లక్షల వరకు ఇన్సురెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది వరకు ఇది ఒక లక్ష రూపాయలుగా ఉంది. డిపాజిట్ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా తీసిన లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బును ఉపసంహరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న మూడు నెలలు లేదా తొంబై రోజుల్లో తిరిగి ఇవ్వాలన్నారు.
పదేళ్ల తర్వాత
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రూ.1 లక్షగా ఉన్న బ్యాంక్ డిపాజిట్ ఇన్సురెన్స్ను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. అలాగే ఈ మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలన్నారు. 'డిపాజిటర్స్ ఫస్ట్ గ్యారంటీడ్ టైమ్ బాండ్ డిపాజిట్ ఇన్సురెన్స్ పేమెంట్ రూ.5 లక్షలకు పెంచాం. అంతకుముందు డిపాజిటర్ ఇన్సురెన్స్ కవర్ రూ.1 లక్షగా ఉంది. ఇప్పుడు ఈ డిపాజిట్ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీంను రూ.5 లక్షలకు పెంచాం. పదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిపాజిటర్ ఇన్సురెన్స్ స్కీంను రూ.5 లక్షలకు పెంచాలని లేఖ రాశారు. కానీ పెంచలేదు. పదేళ్ల తర్వాత దీనిని పెంచాం' అని గోయల్ చెప్పారు.
వడ్డీ రేటు నష్టం లేదు
గతంలో డిపాజిట్ ఇన్సురెన్స్ స్కీం కింద వచ్చే రూ.1 లక్ష డిపాజిటర్కు చేరడానికి ఏళ్లు పట్టేదని, కొన్ని సందర్భాల్లో 10 సంవత్సరాలు కూడా తీసుకున్నదని, అంతకాలం తర్వాత కూడా రూ.1 లక్షే వచ్చేదని, దీంతో అంతకాలానికి గాను వడ్డీ మొత్తాన్ని కోల్పోయేవారని గోయల్ అన్నారు. కానీ ఇప్పుడు 90 రోజుల్లోనే డిపాజిటర్ ఇన్సురెన్స్ మొత్తం రీఫండ్ అవుతుందని చెప్పారు. కాబట్టి కనీసం వడ్డీని కూడా నష్టపోవడం లేదన్నారు. ఎక్కువ మంది డిపాజిటర్లకు లాభపడతారన్నారు.
దశాబ్దాల తర్వాత...
'ప్రభుత్వం అమలు చేస్తున్న డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఒక్కో బ్యాంక్ డిపాజిటర్కు రూ.5 లక్షల వరకు కవరేజీ లభిస్తోంది. ఇలా పూర్తిస్థాయి రక్షణ పొందిన ఖాతాల సంఖ్య గత ఆర్థిక ఏడాదిలో 98.1%కి చేరింది. అంతర్జాతీయంగా ఇది 80 శాతంగానే ఉంది' అని ప్రధాని మోడీ అన్నారు. బ్యాంకులు, కోట్లమంది డిపాజిట్దారులకు, దశాబ్దాలుగా ఉన్న పెద్ద సమస్యకు పరిష్కారం లభించిందని, ఏళ్ల తరబడి స్తంభించిన డబ్బును కొద్దిరోజుల్లో దాదాపు లక్షమందికి పైగా డిపాజిటర్స్ పొందగలిగారని, వారి చేతుల్లోకి దాదాపు రూ.1,300 కోట్లు చేరిందని మోడీ అన్నారు. సమస్యను దాటవేసే ధోరణి విడనాడి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బ్యాంకు డిపాజిట్లకు బీమా సదుపాయం 60వ దశకంలోనే అమల్లోకి వచ్చిందని, మొదట రూ.50వేల వరకు బీమా ఉండేదని, 1993లో ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారని, అంటే ఏదైనా బ్యాంకు నష్టపోతే డిపాజిటర్లకు రూ.లక్ష వరకే దక్కేదని, పైగా ఈ చెల్లింపుకు నిర్దిష్ట గడువు లేదని, 2020 ఫిబ్రవరి 4 నుండి బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచడంతో పాటు 90 రోజుల్లోపే ఆ మొత్తాన్ని చెల్లించేలా నిబంధన తీసుకొచ్చామని, బ్యాంకులను రక్షించాలంటే మనం డిపాజిటర్లకు రక్షణ కల్పించడం తప్పనిసరి అన్నారు.