3 ట్రిలియన్ డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టానికి మార్కెట్ క్యాప్, ప్రాఫిట్ బుకింగ్పై ప్రభావం
BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సరికొత్త మైల్స్టోన్కు చేరుకుంది. మార్కెట్ క్యాప్ తొలిసారి 3 ట్రిలియన్ డాలర్లను తాకింది. సోమవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50,600 పాయింట్ల పైన, నిఫ్టీ 15,20000 పాయింట్లకు పైన ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్ క్యాప్ కొత్త గరిష్టాలను తాకింది. మార్కెట్ క్యాప్ నేడు (మే 26, బుధవారం) మన కరెన్సీలో రూ.2,19,06,461గా ఉంది.
కొద్ది రోజుల్లోనే సరికొత్త రికార్డుకు
బీఎస్ఈ హిస్టరీలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ వ్యాల్యూ 3 లక్షల కోట్ల డాలర్ల పైకి చేరుకుంది. అంతకుముందు రెండు ట్రేడింగ్లలో రూ.3.30 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.218.94 లక్షల కోట్లకు చేరుకుంది. నేడు రూ.2.19 లక్షల కోట్లను తాకింది. 2.5 లక్షల కోట్ల డాలర్ల నుండి కేవలం 159 రోజుల్లో 500 బిలియన్ డాలర్లు పెరిగి మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. సూచీలు నిన్న స్తబ్దుగా ముగిసినప్పటికీ, నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
సూచీలకు దన్ను
కరోనా సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. థర్డ్ వేవ్ ఆందోళనలు కూడా అప్పుడే కనిపిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ నుండి కోలుకోకముందే సెకండ్ వేవ్ తీవ్రంగా దెబ్బకొట్టింది. దీంతో సూచీలు ఇటీవల మళ్లీ పతనమయ్యాయి. అయితే తిరిగి పుంజుకొని సెన్సెక్స్ 51 వేల పాయింట్ల వద్ద ఉంది. సెకండ్ వేవ్ ప్రారంభంలో సూచీలు ఆల్ టైమ్ గరిష్టం 52వేల పాయింట్ల నుండి 47వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. కానీ ప్రభుత్వం చర్యలు, కరోనా కేసుల తగ్గుముఖం, వ్యాక్సినేషన్ వంటి అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
ప్రాఫిట్ బుకింగ్
సెకండ్ వేవ్ కొనసాగుతుండటం, థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో ఇప్పటికే సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి దగ్గరగా ఉన్న సమయంలో ప్రాఫిట్ బుకింగ్ కోసం కొందరు మొగ్గు చూపుతున్నారు. సూచీలు మళ్లీ దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో పడిపోయినంత స్థాయిలో ఉండే అవకాశాలు తక్కువ అంటున్నారు. అంటే సూచీలు ఈసారి పడిపోయినప్పటికీ తక్కువగానే ఉండవచ్చునని అంటున్నారు. అది కూడా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం ఉండవకపోవచ్చునని అంటున్నారు.