1973 నుండి రాబడి అంతే.. ధరలు ఇలాగే..: బంగారంపై ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
2000 డాట్కామ్ సంక్షోభం, 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఇప్పుడు కరోనా వైరస్ సమయంలోను అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా ఆనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రభావం తగ్గి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కుదురుకున్న తర్వాత బంగారం ర్యాలీ అదే విధంగా కొనసాగుతుందా అనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఈ ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 16 శాతం పెరిగాయి.
భారీగా తగ్గిన బంగారం ధర: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు సక్సెస్ అయితే...!
బంగారం.. బాండ్స్
కరోనా కారణంగా మార్కెట్లు నష్టాలను చూస్తున్నాయి. అప్పుడప్పుడు కాస్త కోలుకున్నప్పటికీ తిరిగి కుప్పకూలుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆసక్తి చూపించడం లేదు. పైగా నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్స్, బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇండియాలో కుటుంబాలు బంగారంపై పెట్టుబడి పెట్టడం సహజమే. ఇప్పుడు ఇన్వెస్టర్లు మరింతగా బంగారం వైపు చూస్తున్నారు.
భారీగా పెరుగుదల.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
గత మూడు నాలుగు నెలలుగా బంగారం ధరలు 10 గ్రాములకు రూ.43,000 నుండి రూ.47,000 మధ్య కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలోనే 40 శాతం వరకు పెరిగాయి. ఈ క్యాలెండర్ ఇయర్లో 16 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా పెరిగిన ధరలకు తోడు, ఎక్కువ ధర ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తవచ్చు. అటు ఇక్విటీ మార్కెట్ నష్టాల్లో ఉండటం, బంగారం పెరుగుతున్న పరిస్థితుల్లో.. పెట్టుబడులు సరైన మార్గం ఏది అనే ప్రశ్న ఉదయించడం సహజం.
బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా?
మీరు దీర్ఘకాలానికి గాను పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రస్తుత ధరల (కాస్త హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ) సమయంలో మీ నిర్ణయం సరైనదిగానే భావించవచ్చు. ధరలు కాస్త పెరిగినా, తగ్గినా కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రతిద్రవ్యోల్భణం సమయంలో బంగారం బాగా ర్యాలీ అవుతుందని ఆక్స్ఫర్ట్ ఎకనమిక్ సర్వేలో తేలింది. ప్రతిద్రవ్యోల్భణం అంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, వినియోగం తగ్గడం, ఆర్థిక వ్యవస్థలలో ఒత్తిళ్లు వంటివి.
ఈక్విటీ వదిలి.. బంగారం, బాండ్స్..
2000లో డాట్ కామ్ సంక్షోభం, 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం బాగా ర్యాలీ చేసిందని చెబుతున్నారు. ఈ సంక్షోభాల కంటే కరోనా ప్రభావం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. దలాలు స్ట్రీట్ కుప్పకూలింది. ముడి చమురు ధరల్లో కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. చమురు ధరలు అయితే గతంలో ఎన్నడూ చూడని విధంగా జీరో కంటే దిగువకు పడిపోయాయి. వీటికి భిన్నంగా బంగారం దూసుకెళ్తోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు.. ప్రపంచ, ఆర్థిక వ్యవస్థల జీడీపీని భారీగా తగ్గించాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. దీంతో సంస్థాగత పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్స్ను ఈక్విటీల నుండి బంగారం, బాండ్స్ వైపు మారుస్తున్నారు. అంతేకాదు, ఇటీవల బాండ్ మార్కెట్లో లిక్విడిటీ ఇష్యూ కారణంగా బంగారం దిశగా మళ్లించింది. అలాగే కరోనా ఎప్పటి వరకు తగ్గుతుందో, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇలా వివిధ కారణాలతో రాబోవు రోజుల్లో బంగారం మరింత ర్యాలీ చేయవచ్చునని భావిస్తున్నారు. అయితే అది ఓ పరిమితి వద్ద ఆగిపోతుందని మరికొందరు బులియన్ మార్కెట్ నిపుణులు కొద్దికాలంగా చెబుతున్నారు.
1973 నుండి ప్రతి ఏటా 14 శాతం రిటర్న్స్
21వ తేదీ ఏప్రిల్ 2020న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 1973 నుండి వరుసగా బంగారం ప్రతి సంవత్సరం దాదాపు 14.10 శాతం (రూపాయి పరంగా) రిటర్న్స్ ఇస్తోంది. అదే సమయంలో 21 ఏప్రిల్ 2020న డాలర్ మారకంతో రూపాయి గరిష్ట 77ను చేరుకుంది. రూపాయి బలహీనపడుతోంది. ఇది కూడా బంగారం ధరకు సానుకూలం.
గోల్డ్ మైన్స్ మూసివేత.. ధరల పెరుగుదల
కరోనా మహమ్మారి కారణంగా గోల్డ్ మైన్స్ తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇది కూడా బంగారం ధరలకు సానుకూలమేనని చెబుతున్నారు. ఎందుకంటే సరఫరా తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. మహమ్మారి లేని సమయంలోనే గత ఏడాది బంగారంపై రిటర్న్స్ 25 శాతం వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే 16 శాతం వచ్చాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈక్విటీలపై మరింత ఒత్తిడి ఉంటుందని, అప్పుడు బంగారం ధరలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నాయి.
బంగారంలో ఈ తరహా పెట్టుబడి బెట్టర్..
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడికి ఉత్తమ మార్గం భారత ప్రభుత్వ గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్ లేదా గోల్డ్ సావరిన్ బాండ్స్ కొనుగోలు చేయడంగా చెబుతున్నారు. సావరీన్ గోల్డ్ బాండ్స్ కింద పెట్టుబడిదారులకు బాండ్ ధరలో వ్యాల్యూ పెరగడంతో పాటు వడ్డీ రూపంలో సాధారణ ఆదాయం లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే ఆదాయం పైన ఇన్కం ట్యాక్స్ మినహాయింపు ఉంది. భౌతిక బంగారం కొనుగోలు చేసే సమయంలో ట్యాక్స్ వంటివి కొనుగోలు చేయాలి. ఈటీఎఫ్, బాండ్స్కు అది లేదు. ఈటీఎఫ్, సావరీన్ బాండ్స్ మంచి ఎంపికగా సూచిస్తున్నారు.