ఈ బ్యాంకుల ఏటీఎంల నుండి ఎన్నిసార్లైనా ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు
ATM నుండి నగదు ఉపసంహరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఏటీఎం నుండి నగదు ఉపసంహరణకు ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఉంటుంది. ఈ పరిమితి దాటితే అధిక ట్రాన్సాక్షన్స్ ఫీజు వసూలు చేస్తాయి బ్యాంకులు. బ్యాంకు కస్టమర్లు పరిమితికి మించి చేసే ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ.20కు బదులు ఇక నుండి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది.
ఈపెరిగిన ఛార్జీలు జనవరి 1, 2022 నుంచి అమలులోకి వస్తాయి. వివిధ ప్రయివేటు, ప్రభుత్వ బ్యాంకులు తమ సొంత బ్యాంకు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి నగదును ఉపసంహరించుకోవడానికి ట్రాన్సాక్షన్స్ పరిమితి ఉంది.
పెరిగిన ఛార్జీలు
ఆయా బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకు ఏటీఎం నుండి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకుల నుండి మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఈ పరిమితి మించి చేసే ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు వర్తిస్తాయి. ఇంటర్ఛేంజ్ ట్రాన్సాక్షన్స్ ఫీజును పెంచేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీంతో ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన రూ.15 నుండి రూ.17, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన రూ.5 నుండి రూ.6కు పెంచుకోవడానికి అనుమతి లభించింది.
ఈ బ్యాంకుల్లో...
అయితే కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్స్ అందిస్తున్నాయి. ఇందులో ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రయివేటు బ్యాంకులు ఉన్నాయి. అయితే ఐడీబీఐ కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించే సదుపాయాన్ని అందిస్తోంది. మిగిలిన వాటికి ఆర్బీఐ నిర్దేశించిన ఉచిత ట్రాన్సాక్షన్స్ పరిమితులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. బ్యాంకు సొంత ఏటీఎంలలో మొదటి 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం. తర్వాత నుండి ఛార్జీలు వర్తిస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రదేశాల్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం.
అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్స్
ఇక, ఇండస్ఇండ్ బ్యాంక్ ఏ ఏటీఎం వద్ద అయినా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దేశంలో ఏ ఏటీఎం వద్ద అయినా, ఎన్నిసార్లు అయినా ఉచితంగా నగదును ఉపసంహరించుకోవచ్చు. సిటీ బ్యాంకు కూడా అపరమిత ఉచిత ట్రాన్సాక్షన్స్ అందిస్తోంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తున్న అకౌంట్ హోల్డర్లు అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎస్బీఐ. రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ నిర్వహించేవారికి ఏ ఏటీఎంలో అయినా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్స్ పరిమితి ఉంది.