భారతదేశంలో ఎక్కువ శాలరీ వచ్చే ఉద్యోగాలు ఇవే...
భారత్లో ఉద్యోగాలకు తగిన వేతనం చెల్లించరనేది తరచూ మనం వినే మాట. అయితే ప్రతి నెలా మన నగరాల్లో ఉండే కొంత మంది వ్యక్తులకు అంత చెల్లిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ
ప్రస్తుత పెట్టుబడిదారి సమాజంలో ఉద్యోగం లేకుండా ఉండటం సగటు మధ్య తరగతి వారికి కష్టం. మొదట ఏదో ఉద్యోగం అనుకున్నా చాలా మంది మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు మొగ్గుచూపుతారు. వివిధ కారణాల రీత్యా ఉద్యోగం చేసేవారికి ఇచ్చే వేతనం కొన్నింటిలో ఎక్కువ, కొన్నింటిలో తక్కువ ఉంటుంది. ఇండియాలో అత్యధిక వేతనాలు వచ్చే 10 రకాల ఉద్యోగాలు ఇచ్చాం. కొన్ని జాతీయ మీడియా వెబ్సైట్ల విశ్లేషణ ఆధారంగా ఇచ్చిన జాబితా మీ కోసం...
1. స్టాటిస్టికల్ అనలిస్టులు(గణాంక నిపుణులు)
ఈ ఉద్యోగాలు కూడా దాదాపుగా డేటా అనలిస్టుల్లాంటివే. బిజినెస్ ఇంటెలిజెన్స్కు ప్రాముఖ్యం పెరుగుతున్న నేటి రోజుల్లో వీరి అవసరం పెరుగుతోంది. సమాచారాన్నంతా సేకరించి, విశ్లేషించి దాన్ని విభజించి సులువుగా అర్థమయ్యేలా వివిధ చిత్రాల సాయంతో ప్రెజెంట్ చేయాల్సిన బాధ్యత గణాంక నిపుణులదే. ఇందుకోసం వెన్చిత్రాలు, రేఖా చిత్రాలు, గ్రాఫ్లు వంటి వాటి సాయం తీసుకుంటారు. ఇలాంటి ఉద్యోగాల కోసం డిగ్రీ అర్హత ఉంటే చాలు.
వేతనం నెలకు రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ ఉంటుంది.
2. స్పేస్ సైంటిస్టులు
స్పేస్(అంతరిక్షం) గురించిన పరిశోధనలు పెరుగుతూ ఉన్నాయి. మన దేశం ఇప్పటికే అంగారక గ్రహంపైకి మంగళయాన్ను పంపింది. భవిష్యత్తులో మానవ సహిత యాత్రల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టుకు సైతం ఇస్రో సన్నధ్దమవుతోంది. అయితే ఈ ఉద్యోగాలు ఎక్కువగా ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ రంగంలోని వ్యక్తులు మంచి వేతనాలు అందుకుంటున్నారు. ఈ ఉద్యోగాల కోసం సైన్స్ రంగంలో డాక్టరేట్ లేదా పోస్ట్ డాక్టరేట్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.
వేతనం నెలకు రూ. 80 వేల నుంచి రూ. 3 లక్షల వరకూ ఉండొచ్చు.
3. డాక్టర్లు(వైద్య వృత్తి)
మనం ఎలాంటి విత్తనం వేస్తామో అలాంటి పంటే మన చేతికి వస్తుందే అనేది పురాతన సామెత. దానికి డాక్టర్లు ఉత్తమ ఉదాహరణ. ఏదో ఒక స్పెషలైజేషన్ పూర్తి చేసిన కన్సల్టెంటుగా మారాలంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. సూపర్ స్పెషలైజేషన్ పూర్తి చేసేందుకు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. చేతిలో కష్టపడి సంపాదించుకున్న పట్టాలకు ఎక్కువ డబ్బు సంపాదించే వారిలో ఈ వృత్తి కూడా ఒకటి.
కనీస అర్హత ఎంబీబీఎస్ ఉండాలి.
వేతనం నెలకు రూ. 43 వేల నుంచి రూ. 6 లక్షల వరకూ ఉంటుంది. (స్పెషలైజేషన్ బట్టి)
4. యాప్ డెవలపర్
ప్రస్తుతమంతా ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ప్రతి చిన్న పనికీ వెబ్సైట్లు, యాప్లు వస్తున్నాయి. పేరెన్నికగన్న సంస్థలు మొబైల్ అప్లికేషన్లను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. యాప్డెవలపర్ చేయాల్సిన పని మంచి యూజర్ ఇంటర్ఫేస్ ఉండేలా యాప్లను అభివృద్ది చేయడం. కొన్ని బ్రాండ్లు కేవలం మొబైల్ సైట్లలోనే లభ్యమవుతున్నాయి. మరికొన్ని ఈ-కామర్స్ సైట్లు కేవలం యాప్ల ద్వారానే వ్యాపారం చేస్తున్నారు. మొబైల్ ఆధారిత యాప్ డెవలపర్లు ఇటువంటి యాప్లకు ప్రాణం పోస్తారు.
ఈ ఉద్యోగాల కోసం కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. అయితే యాప్ డెవలప్మెంట్లో ఏదైనా కోర్సు చేసి ఉండాలి.
కనీస వేతనం నెలకు రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకూ ఉంటోంది.
5. పైలెట్లు
ఆకాశంలో ఎగిరే విమానాల్లో ప్రయాణించాలనే ఆత్రుత ఎంతోమందికి ఉంటుంది. అలాంటి విమానాలను నడిపే జాబ్ అంటే ఇంకెంత ఉత్సాహంగా ఉంటుందో ఊహించండి. పైలెట్ ఉద్యోగం చేసే వారికి చాలా సానుకూలతలు ఉంటాయి. భారతదేశంలో పైలెట్లకు ఎక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు చాలా అదనపు సౌకర్యాలు కల్పిస్తారు.
ఇంటర్మీడియట్ తర్వాత పైలెట్ శిక్షణ కార్యక్రమం పూర్తిచేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు.
కనీస వేతనం నెలకు రూ. 1.5 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకూ ఉంటుంది.
6. ప్రొఫెసర్లు
సాఫ్ట్వేర్ రంగం పుంజుకున్న దగ్గర నుంచీ ముఖ్యంగా సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో టీచింగ్ వైపు వెళ్లేవారు తక్కువయ్యారు. అకడమిక్స్ వైపు వెళ్లాలంటే ఎంతో సహనం, వృత్తి నైపుణ్యంతో పాటు ఏదో సాధించాలనే పట్టుదల ఉండాలి. ఎందుకంటే ఏ వృత్తి నిపుణుడినయినా తయారుచేసేది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నోళ్లే కదా.
ప్రొఫెసర్ కావాలంటే కనీసం ఎం.ఫిల్ లేదా డాక్టరేట్ ఉండాలి.
మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొదలుపెట్టవచ్చు. తర్వాత నెమ్మదిగా పీ.హెచ్డీ చేస్తూ ప్రొఫెసర్గా స్థిరపడొచ్చు. దేశంలో చాలా విశ్వవిద్యాలయాలు పీ.హెచ్.డీ చేసుకుంటూనే డిగ్రీ స్థాయి వారికి పాఠాలు చెప్పేందుకు వీలును కల్పిస్తున్నాయి.
ప్రొఫెసర్లకు కనీస వేతనాలు రూ. 40 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ ఉంటుంది.
7. ఎస్ఈవో అనలిస్టులు
సోషల్ మీడియా, గ్రోత్ హ్యాకర్లు చేసే పని కంటే కాస్త ఎక్కువగా పైస్థాయిలో జరిగే పనిని ఎస్ఈవో అనలిస్టులు చేస్తారు. స్టార్టప్లు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఈ రోజుల్లో టెక్ కంపెనీలన్నీ ఎస్ఈవో విశ్లేషణపై దృష్టి పెడుతున్నాయి. చాలా మీడియా, పరిశోధన, ఫార్మా, పుస్తకరచన, ఐటీ సంస్థల్లో ఎస్ఈవోల తోడ్పాటు ఇతోధికంగా అవసరమవుతుంది. ఎవరైనా గూగుల్లో ఏదైనా సమచారం కోసం వెతికినప్పుడు దానికి సంబంధించి మొదట ఆయా వెబ్సైట్ల లింక్లు వచ్చేలా చేయడం ఎస్ఈవోల ప్రధాన కర్తవ్యం. కనీసం గ్రాడ్యుయేషన్తో ఈ ఉద్యోగాలు సాధించవచ్చు. కావాల్సిందల్లా సబ్జెక్టు మీద పట్టు, ఆసక్తి. టైర్-2 నగరాల్లో ఇంటర్మీడియట్ అర్హతతో సైతం యువతరం ఈ విధమైన పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
వేతనాలు నెలకు కనీసం రూ. 30 వేల నుంచి మొదలుకొని రూ.1 లక్ష వరకూ ఉంటున్నాయి. బహుళ జాతి కంపెనీలు నైపుణ్యం కలిగిన ఎస్ఈవో అనలిస్టుల కోసం ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడటం లేదు.
8. సోషల్ మీడియా మేనేజర్
ఏదైనా బ్రాండ్కు వెబ్సైట్ ద్వారా ప్రాచుర్యం కల్పించడంలో సోషల్ మీడియా పాత్ర ఎనలేనిది. ఇప్పుడు ఈ రంగంలో ఉన్న చాలా మందికి 10 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది. వారంతా బ్రాండ్లకు సోషల్ మీడియాలో పేరు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు. వీరికి కంపెనీల్లో ప్రత్యేక గౌరవం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు కనీస అర్హత ఏదైనా డిగ్రీ.
వేతనం నెలకు రూ. 30 వేలు మొదలుకొని రూ. 3 లక్షల వరకూ ఆఫర్ చేసే సంస్థలున్నాయి.
9. రిలేషన్ షిప్ థెరపిస్టులు
పాశ్చాత్య దేశాల్లో ఇది రెగ్యులర్ ప్రొఫెషన్. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ తరహా ఉద్యోగాలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇంతకుముందు సైకాలజిస్టులకు అదనంగా వీరి పని ఉండేది. ఇప్పుడు చాలా బహుళజాతి కంపెనీలు ఫుల్ టైమ్ కోసం రిలేషన్ షిప్ మేనేజర్లను, రిలేషన్ షిప్ నిపుణులను నియమించుకుంటున్నాయి. వీరి పనంతా ఉద్యోగంలో సహచరులు, సబ్ ఆర్డినేట్లు, మేనేజ్మెంటుతో ఎలా మసలుకోవాలో ప్రతి ఉద్యోగికి వివరించడం. వృత్తి, ఉద్యోగాలు, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం ఎలా సాధించాలో వీరు నేర్పుతారు.
కనీస అర్హత డిగ్రీతో ఈ ఉద్యోగాలను సాధించవచ్చు. ఎంబీఏ కలిగి ఉండటం అదనపు అడ్వాంటేజ్. ఎం.ఏ(పబ్లిక్ రిలేషన్స్) చదివిన వారు సైతం ఈ రకమైన ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
వేతనం నెలకు రూ. 30 వేలు మొదలుకుని గరిష్టంగా రూ. 1 లక్ష వరకూ ఉంటుంది. ఇది ప్రారంభంలోనే. తర్వాత నెమ్మదిగా మంచి పొజిషన్(డిజిగ్నేషన్)తో పాటు గౌరవమైన వేతనం, ఉన్నత హోదా సాధిస్తారు.
10. టెక్నికల్ రైటర్లు
కంటెంట్ రైటర్లు, రచయితలు ఒక ఎత్తయితే టెక్నికల్ రైటర్లంతా మరింత ప్రత్యేకం. కేవలం రాయటమే కాదు, సాంకేతికంగా ఒక సంస్థకు లేదా ప్రొగ్రామింగ్ కంపెనీకి చెందిన అంశాలపై వారు పట్టు సాధించి ఉంటారు. అడోబ్, ఒరాకిల్, బిగ్డేటా, హడూప్, శ్యాప్ లాంటి వాటికి సంబంధించిన అంశాలపై రాయాలంటే సాంకేతిక పదజాలంపై అవగాహన ఉండాలి.
ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలు సైతం టెక్నికల్ కంటెంట్ రైటర్ల కోసం విపరీతమైన డిమాండ్ను ఎదుర్కొంటున్నాయి. ఏదైనా డిగ్రీ ఉండి, సాంకేతిక పదజాలంపై పట్టు ఉంటే ఉద్యోగం చేయవచ్చు.
వేతనం నెలకు . 50 వేల నుంచి రూ. 1.7 లక్షల వరకూ ఉంటుంది.
మిగిలిన ఉద్యోగాల్లో లాగా ఒక నిర్ణీత పనివేళల్లో పనిచేస్తే పరిపోదు. నిరంతరం కొత్త అంశాల కోసం అన్వేషిస్తూ, పాఠకుల(టార్గెట్ ఆడియన్స్) కోసం సరిపడా సమాచారాన్ని సేకరించే పనిలో ఉండాలి.
11. గ్రోత్ హ్యాకర్లు
కేవలం మన కంపెనీ గురించి ప్రచారం చేసే మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజుల్లో పనికిరావు. అన్ని మార్కెటింగ్ పద్దతుల్లో, ఉత్పత్తుల తయారీలో పోటీదారుల గురించి పరిశోధించాలి. వ్యాపార వృద్దికి అవతలి వాళ్లు ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తున్నారు, కొత్త పద్దతులు ఎలాంటి ఫలితాలనిస్తాయనే పరిశోధన, విశ్లేషణలు ముఖ్యం. సంప్రదాయ, సరికొత్త సాంకేతిక విధానాల ద్వారా మార్కెటింగ్ పరిశోధన జరగాలి. ఇందుకోసం గ్రోత్ హ్యాకర్లు నిరంతరం పనిచేయాలి. తద్వారా కంపెనీ వ్యాపార వ్యూహాల్లో సమగ్రత ఏర్పడుతుంది. ఈ తరహా ఉద్యోగాలకు కనీస అర్హత ఏదైనా డిగ్రీ.
వీరికి ఇచ్చే జీతభత్యాలు నెలకు రూ. 60 వేల నుంచి ప్రారంభమై రూ. 3 లక్షల వరకూ ఉంటాయి.