కరోనా అంతు చూద్దామిక: మరో దేశీయ వ్యాక్సిన్: 12-17 ఏళ్లలోపు వారికీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని ఉత్పాతానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ఉసురు తీస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. వరుసగా మరోసారి కూడా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 4,01,078 కేసులు నమోదయ్యాయి. 4,187 మంది బలి అయ్యారు. యాక్టివ్ కేసులు 37,23,446గా రికార్డయ్యాయి.
రూ.50 వేలకు టచ్: బంగారం కొనాలనుకుంటున్నారా? ఆలోచించాల్సిందే!
ఇప్పటికే రెండు..
ఈ పరిస్థితుల్లోనూ- కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 16,73,46,544 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం అందుబాటులో ఉన్నవి రెండు టీకాలే. ఒకటి- కోవిషీల్డ్.. రెండు- కోవాగ్జిన్. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. దీన్ని మనదేశానికే చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. కోవాగ్జిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ త్వరలో అందుబాటులోకి రానుంది.
మరో దేశీయ వ్యాక్సిన్..
తాజాగా- ఇదే జాబితాలో మరో టీకా చేరబోతోంది. అదే జైకోవీ-డీ (ZyCoV-D). ప్లాసిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ ఇది. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా (Zydus Cadila) దీన్ని అభివృద్ధి చేసింది. ఈ నెలలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రతి నెలా కోటి డోసుల మేర వ్యాక్సిన్ను తయారు చేసేలా జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ యాజమాన్యం ప్రణాళికలను రూపొందించుకుంది.
ప్రతినెలా మూడు కోట్ల డోసుల వరకు
దీన్ని క్రమంగా రెండు నుంచి మూడు కోట్లకు పెంచేలా ఏర్పాట్లు చేస్తామని జైడస్ క్యాడిలా మేనేజింగ్ డైరెక్టర్ షర్వీల్ పటేల్ తెలిపారు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. జైకోవీ-డీ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ముగింపుదశకు వచ్చేశాయని, ఇంకొద్దిరోజుల్లో తాము ఈ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన దరఖాస్తులను డ్రగ్ కంట్రోలర్ జనరల్కు పంపిస్తామని తెలిపారు. ఈ మేరకు క్లినికల్ డేటాలను సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు.
12 నుంచి 17 ఏళ్ల లోపు వారిపై ట్రయల్స్..
12 నుంచి 17 సంవత్సరాల లోపు వయస్సున్న వారిపైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు షర్వీల్ పటేల్ తెలిపారు. 28 వేల మంది వలంటీర్లపై ట్రయల్స్ పూర్తి చేశామని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ 18 సంవత్సరాలు దాటిన వారికే వేయాల్సి ఉంటుందని, దీనికి భిన్నంగా తాము జైకోవీ-డీని అభివృద్ది చేసినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉన్న చోట స్టోరేజీ చేయాల్సి ఉంటుందని, 25 డిగ్రీల సాధారణ టెంపరేచర్ వద్ద కూడా నిల్వ ఉంచుకోవచ్చని పేర్కొన్నారు.