జొమాటో ఫౌండర్ దాతృత్వం: ఫుడ్ డెలివరి సిబ్బంది, వారి పిల్లల కోసం రూ.700 కోట్లు విరాళం
ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ కళ్లు చెదిరే విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా 700 కోట్ల రూపాయలను డొనేషన్గా ఇవ్వనున్నారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్స్ కార్యకలాపాల కోసం అతను ఈ భారీ విరాళాన్ని మంజూరు చేయనున్నారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులందరికీ ఇ-మెయిల్స్ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చేరవేశారు. ఎంప్లాయిీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసోప్స్) కోసం ఈ నిధులను కేటాయించాల్సి ఉంటుంది.
జొమాటో డెలివరి పార్ట్నర్స్ ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించడానికి లక్ష రూపాయలను కేటాయిస్తుంది కంపెనీ. అయిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు దీనికి అర్హులు. అదే పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ఉంటే వారి ఇద్దరు పిల్లల చదువు కోసం రెండు లక్షల రూపాయలను ఇస్తుంది కంపెనీ యాజమాన్యం. 5/10 ఏళ్ల సర్వీసు ఉన్న మహిళా ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ కోసం అదనపు సౌకర్యాన్ని కల్పించింది. 12వ తరగతి పూర్తి చేసుకున్న ఆడపిల్లల కోసం ప్రైజ్ మనీని ప్రవేశపెట్టింది.
ఉద్యోగులు, సిబ్బంది పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్ వ్యవస్థను ప్రవేశపెడుతుంది. విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదానికి గురైన ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ కుటుంబాలను ఆదుకోవడానికి, వారి పిల్లల చదువుల కోసం కూడా ఈ 700 కోట్ల రూపాయల నుంచి ఖర్చు చేయనున్నట్లు తెలిపింది జొమాటో కంపెనీ. ఈ విషయంలో సర్వీస్తో పని లేదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కూడా ఈ సౌకర్యం వర్తింపజేసింది.
ఇది తొలి అడుగు మాత్రమేనని, మరిన్ని వసతులు, సౌకర్యాలను తన సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగుల కోసం ప్రవేశపెడతామని దీపిందర్ గోయెల్ తెలిపారు. దీనికోసం జొమాట్ ఫ్యూచర్ ఫౌండేషన్స్ కోసం పెద్ద ఎత్తున విరాళాలను సేకరించనున్నట్లు చెప్పారు. ఉద్యోగులు బాగుంటేనే సంస్థ పురోగమిస్తుందనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.