Zomato: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
Zomato: ఫుడ్ ఆర్డర్ చేయాలంటే టక్కున గుర్తొచ్చే పేరు 'జొమాటో'. వివిధ రకాల సేవల ద్వారా వినియోగదారులకు దగ్గరైంది. ప్రపంచమంతా లే ఆఫ్ ల మోత మోగిపోతుండగా.. నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తమ కంపెనీపై మీడియాలో వస్తున్న పలు వార్తలపై సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. పలు ఆరోపణలను ఖండించారు.
నిరుద్యోగులకు శుభవార్త:
లే ఆఫ్ లతో సతమవుతున్న నిరుద్యోగులకు దీపిందర్ శుభవార్త చెప్పారు. తమ కంపెనీలో 5 రకాల ఉద్యోగాలకుగాను 800 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు వెల్లడించారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు CEO, జనరల్, గ్రోత్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్లు తెలిపారు. గతేడాది నవంబరులో ఉన్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడారు. UAEలో ఫుడ్ డెలివరీ సేవలను సైతం జొమాటో నిలిపివేసి.. ఖర్చులు తగ్గింపుల్లో భాగంగా 3 శాతం మంది సిబ్బందిని అక్కడ తొలగించడం గమనార్హం.
ఆ సేవలు నిలిపేశారా..?
వ్యాపారంలో వృద్ధి సాధించడంలో జొమాటో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీడియాలో వార్తలు వచ్చాయి. అందుబాటులో ఉన్న అవకాశాన్ని లాభదాయకంగా మార్చుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో సైతం వినిపిస్తోంది. అందువల్ల పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలను జొమాటో నిలిపివేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ కంపెనీ CEO దీపిందర్ గోయల్ తన లింక్డ్ ఇన్ పోస్ట్ ద్వారా సమాధానమిచ్చారు. తప్పుడు వార్తలను ఆయన ఖండించారు. రీబ్రాండింగ్ లో భాగంగా భాగస్వాములతో కలిసి మరింత మెరుగైన సేవలు అందిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
రీబ్రాండింగ్ మాత్రమే..
పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ను తీర్చడానికి శీఘ్ర డెలివరీ విధానాన్ని జొమాటో తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రామ్లో 2022 మార్చిలో దీనిని ప్రారంభించబడింది. అనంతరం బెంగళూరుకు సైతం ఈ తరహా సేవలను విస్తరించింది. ఓ ప్రాంతంలో తరచుగా ఆర్డర్ చేస్తున్న దాదాపు 30 వంటకాలతో 'ఫినిషింగ్ స్టేషన్లు' ఏర్పాటు చేసింది. తద్వారా 10 నిమిషాల్లో డెలివరీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించింది.
ఇప్పుడు వాటిపై ఆరోపణలు రాగా.. వాటిని మూసివేయడం లేదని కంపెనీ సీఈవో స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంటకాలకు కొత్త వాటిని చేర్చేందుకు భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు ఎవరికీ ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు.