జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే
అందరికీ బ్యాంకు అకౌంట్ ఉండాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం జన్ ధన్ అకౌంట్ను తీసుకు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు మొదలు ప్రయివేటు కంపెనీలు అందించే వేతనాల వరకు అన్ని ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికీ బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. అయితే బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవాలంటే మినిమం బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే మినిమం బ్యాలెన్స్ లేనందుకు సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తారు. ప్రధాన బ్యాంకుల్లో ఖాతా తెరవాలంటే కనీసం రూ.1000 నుండి రూ.10,000 వరకు ఉండాలి. HDFC, ICICI బ్యాంకుల్లో పట్టణాల్లో కనీస బ్యాలెన్స్ రూ.10000 ఉండాల్సిందే. చాలామందికి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి వారి కోసమే పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ను అందిస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రోత్సహించేందుకు బ్యాంకులు ఈ ఖాతాలను అందిస్తున్నాయి
నిబంధనల మేరకు బ్యాంకు ఖాతాదారుకు ఎస్సెమ్మెస్/ఈ-మెయిల్/లేఖ ద్వారా మినిమం బ్యాలెన్స్ గురించి బ్యాంకులు తెలియజేయాలి. అలాగే, మినిమం బ్యాలెన్స్ పునరుద్ధరణకు సమయమివ్వాలి. నెలవారీ బ్యాలెన్స్ అవసరాన్ని మార్చినట్లయితే కస్టమర్కు తెలియజేయాలి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY), BSBDA కింద తెరిచిన ఖాతాలకు కనీస నగదు నిల్వ లేకున్నప్పటికీ ఎలాంటి జరిమానా విధించవద్దు. ఆర్బీఐ నిబంధనల మేరకు బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలకు కనీస నిల్వ అవసరం లేదు. ఇందులోకి జన్ ధన్ యోజన ఖాతా కూడా వస్తుంది. బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకోవచ్చు. వివిధ బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ లేకుండా అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..
ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్ పేరుతో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ను అందిస్తుంది IDBI ఫస్ట్ బ్యాంకు. వడ్డీ రేటు నాలుగు శాతం. రోజుకు రూ.40 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ అకౌంట్తో రూ.2 లక్షల కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ ఉంది. అయితే ఈ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవాలంటే మరే ఇతర బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండకూడదనే నిబంధన ఉంది.
ఎస్బీఐ అందించే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఖాతా... సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్. సాధార సేవింగ్స్ ఖాతా మాదిరిగానే ఈ ఖాతా బ్యాలెన్స్ పైన కూడా వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 2.7 శాతంగా ఉంది. కేవైసీ డాక్యుమెంట్స్తో ఈ ఖాతాను తెరువవచ్చు. ఎలాంటి ఛార్జీ లేకుండా బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును అందిస్తుంది.
స్మార్ట్ శాలరీ అడ్వాంటేజ్ అకౌంట్ పేరుతో యస్ బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది వడ్డీ రేటు నాలుగు శాతంగా ఉంది. వేతనం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు మాత్రమే ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. రూ.75వేల వరకు ఉపసంహరణ పరిమితితే ఎంగేజ్ డెబిట్ కార్డును ఇస్తారు. ఇది పర్సనల్ యాక్సిడెంట్ బీమాతో వస్తుంది.
HDFC జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా పేరు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(BSBDA). ఇది మూడు శాతం వడ్డీ రేటును అందిస్తోంది. HDFC బ్యాంకుతో శాలరీ అగ్రిమెంట్ ఉన్న సంస్థ ఉద్యోగులు మాత్రమే ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. మరో బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేదా శాలరీ అకౌంట్ ఉంటే తెరవలేరు.
కొటక్ మహీంద్రా అందించే జీరో బ్యాలెన్స్ అకౌంట్... 811 డిజిట్ బ్యాంకు అకౌంట్. ఈ అకౌంట్లోని సొమ్ముపై 3.50 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఈ ఖాతాను బ్యాంకుకు రాకుండా కేవైసీ ద్వారా తెరుచుకోవచ్చు. ఇక స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు అకౌంట్ అందించే బ్యాంకు ఖాతా ఆసాన్. ఇందులో వడ్డీ రేటు 2.75 శాతం ఉంది. ఖాతాలో రోజువారీగా ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. క్వార్టర్ పరంగా చెల్లిస్తారు. ఆధార్ ఆధారిత కేవైసీతో ఇన్స్టాంట్గా ఖాతాను తెరువొచ్చు.
ఇండస్ఇండ్ బ్యాంకు అందిస్తున్న జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు - ఇండస్ ఆన్లైన్ సేవింగ్స్ అక్కౌంట్. వడ్డీ రేటు 4 శాతం అందిస్తోంది. ఈ ఖాతాను తెరిచేందుకు మొబైల్ నెంబర్ ఉండాలి. ఆధార్తో అనుసంధానించి ఉండాలి. పాన్ నెంబర్ ఉండాలి. రూ.2 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ లభిస్తుంది.
కాగా, ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో కస్టమర్లకు భారీ ఊరట ఇచ్చింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా ఉంటుంది. ఇప్పుడు ఈ నిబంధనను రద్దు చేసినట్లు ఇటీవల ప్రకటించింది. సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధించే నిబంధన రద్దు చేయడం కస్టమర్లకు అతిపెద్ద ఊరట. ఇప్పటి వరకు సగటు నెలవారీ నిల్వ లేని ఖాతాదారుల నుండి అపరాధ రుసుము వసూలు చేసింది. ఇక నుండి కనీస నిల్వ లేకున్నప్పటికీ అపరాధ రుసుము వసూలు చేయదు.