అమ్మఒడి రూ.15,000లలో 1,000 తిరిగివ్వాలి, బ్యాంకులు అప్పు కింద జమ చేసుకోవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పిల్లలను స్కూల్కు పంపించే ఒక్కో తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15వేలు జమ అవుతుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్లలో చదివే 82 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,456 కోట్లు జమ చేస్తారు. దీనిపై జగన్ నిన్న ప్రకటన చేశారు.
నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు: జగన్ అమ్మఒడికి రూ.6,500 కోట్లు
బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకోలేవు
అమ్మఒడి పథకం కింద తల్లుల అకౌంట్లలో వేసే రూ.15,000 మొత్తాన్ని ఏ బ్యాంకు కూడా తమ అప్పుల కింద జమ చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులు సహకరించేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఒక్కసారికి విద్యార్థికి 75 శాతం హాజరు లేకున్నా మినహాయింపు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం హాజరు తప్పనిసరి.
రూ.15,000లల్లో రూ.1,000 ఇవ్వండి.. ఎందుకంటే
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తీసుకు రావడంతో పాటు పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. మీ పిల్లలు వెళ్లే స్కూల్ వాచ్మెన్ మీద, బాత్రూంల మీద ధ్యాస పెట్టాలని జగన్ సూచించారు. ఇందుకు మీకు అందే రూ.15,000 నుంచి పాఠశాల నిర్వహణ కోసం రూ.1,000ని పేరెంట్స్ కమిటీకి అప్పగించాలని జగన్ సూచించారు.
అందుకే ఇవ్వండి...
రూ.15వేలల్లో రూ.వెయ్యి తిరిగి ఇవ్వడం ద్వారా వాటిని మరుగుదొడ్ల శుభ్రతకు, శానిటరీ వస్తువుల కొనుగోలుకు, వాచ్మెన్ జీతాలు చెల్లించేందుకు ఖర్చు చేయాలని సూచించారు. బడికి పేరెంట్స్ నిర్వాహకులుగా వ్యవహరించాలని సూచించారు. నిర్వహణ బాగా లేకుంటే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, అందుకే పాఠశాలల నిర్వహణ బాధ్యతను తల్లులు తీసుకోవాలన్నారు.
సచివాలయంలో సంప్రదించాలి
అమ్మఒడి నిధులు ఎవరికైనా రాకుంటే సచివాలయంలో సంప్రదించాలని జగన్ సూచించారు. కాగా, అమ్మ ఒడి పథకం కింద 42,12,186 తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.
వివిధ పథకాలకు ఖర్చు ఎంత అంటే?
- పిల్లలందరినీ బడికి పంపించే ఉద్దేశ్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకు వచ్చారు. దీనికి రూ.6,456 కోట్లు ఖర్చు అవుతుంది.
- పిల్లలకు పౌష్టికాహార భోజనం కోసం నాణ్యమైన మధ్యాహ్నం భోజనం కోసం అదనంగా రూ.360 కోట్లు ఖర్చు.
- స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాడు - నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి రూ.14,000 కోట్లు.
- అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకం జగనన్న విద్యా దీవెన కోసం ఫీజు చెల్లింపు.
- హాస్టల్ ఖర్చులను ప్రభుత్వం భరించడం కోసం జగనన్న వసతి దీవెన కోసం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.20వేలు.
మధ్యాహ్న భోజనంలో మార్పులు
పిల్లల మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. మెనూ మార్పు ద్వారా రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. భోజనం వండి పెట్టే ఆయాల జీతాలు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెరిగాయి. దీంతో రూ.160 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. మొత్తం రూ.360 కోట్లు అదనపు ఖర్చు.
మధ్యాహ్న భోజనంలో మార్పులు ఇవే...
సోమవారం అన్నం, పప్పు చారు, గుడ్డు కర్రీ, స్వీట్ చిక్కీ
మంగళవారం పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
శనివారం అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్