ద్రవ్యోల్బణం తగ్గేందుకు, రెపో రేటు మరో 80 బేసిస్ పాయింట్లు పెంచవచ్చు
ద్రవ్యోల్భణంపై పోరుకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును మున్ముందు మరిన్నిసార్లు పెంచవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ వరుసగా రెండుసార్లు రెపో రేటును పెంచడంతో వడ్డీ రేటు 4 శాతం నుండి 4.90 శాతానికి చేరుకుంది. అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేటును పెంచుతున్నాయి. వివిధ కేంద్ర బ్యాంకులు మూడు నుండి నాలుగేళ్ల పాటు వడ్డీ రేట్లు పెంచే అవకాశముందని, 1970లలో ఇలాగే జరిగిందని ప్రముఖ సింగపూర్ ఆర్థిక నిపుణులు జిమ్ రోగర్స్ అన్నారు. వడ్డీ రేట్లు మున్ముందు పెరుగుతాయని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
ఆర్బీఐ కూడా మున్ముందు ఎంపీసీ సమావేశాల్లో మరిన్ని రేట్ల పెంపుకు మొగ్గు చూపితే ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యవస్థలో నగదు లభ్యత మరీ సులభం కాకుండా చూడటం వల్ల ఆహార, ఇంధన ధరలను అదుపులోకి తీసుకు రావొచ్చునని, తద్వారా ద్రవ్యోల్భణం తగ్గుతుందని చెబుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఆర్బీఐ ఇప్పటికే రెండు దఫాల్లో కలిపి 90 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచడంతో వ్యవస్థలో నగదు లభ్యతను తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్భణాన్ని 2 శాతం నుండి 6 శాతం మధ్య ఉంచేందుకు మరో 80 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచే అవకాశముందని ఆర్థికవేత్తలు అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 75 బేసిస్ పాయింట్ల వరకు భావిస్తున్నారు. ఇటీవల భారీగా పెరిగిన వంట నూనెలు, కేంద్రం చర్యలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఊరట కలుగుతోంది.