YES bank crisis: ఏదేమైనా వారంలో కస్టమర్లకు శుభవార్త, నగదు విత్డ్రా పైన కూడా...
సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ బ్యాంకు కస్టమర్లు నెలలో రూ.50,000 మించి నగదు తీసుకోకుండా పరిమితి విధించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఏటీఎంలకు క్యూ కట్టారు. బ్యాంకులకు వెళ్లి చెక్కుల ద్వారా తీసుకున్నారు. యస్ బ్యాంకు పరిణామాలు వారిని కలవరపెడుతున్నాయి. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకోవద్దనే పరిమితి మరింత ఇబ్బందికరంగా మారింది. నగదు వస్తుందో లేదో ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఊరట కలిగించే విషయం చెప్పారు.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు
వారం రోజుల్లో విత్ డ్రా పరిమితి ఎత్తివేత
యస్ బ్యాంకు కస్టమర్లు తమ నగదు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ పరిమితిని నెల రోజులు అని ఆర్బీఐ చెప్పినప్పటికీ, మరో వారం రోజుల్లో ఎత్తివయవచ్చునని రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. కస్టమర్ల డబ్బు చాలా భద్రంగా ఉంటుందని ధైర్యం నింపారు.
ఓ ప్రక్రియ ఉంటుంది..
యస్ బ్యాంకుపై విధించిన మారటోరియం వారం రోజుల్లో ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ బ్యాంకు సంక్షోభం తర్వాత ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంతో ఎస్బీఐ కలిసి పని చేశాయని, అయితే తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసేందుకు, కొత్త మూలధనం తీసుకు రావడానికి నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందన్నారు.
ఏదేమైనా వారంలో శుభవార్త వింటారు
మూలధనం అంశానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతోందని, వారంలో లేదా అంతకంటే తక్కువ కాలంలోనే యస్ బ్యాంకు ఖాతాదారులు శుభవార్త వింటారని రజనీష్ కుమార్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే యస్ బ్యాంకు కోలుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. యస్ బ్యాంకును ఆదుకునేందుకు ఎస్బీఐ సహకరిస్తుందన్నారు.
ఏప్రిల్ 3 కంటే ముందే..
మొత్తానికి ఏప్రిల్ 3వ తేదీ కంటే ముందే యస్ బ్యాంకు క్యాష్ విత్ డ్రా, ఇతర సంక్షోభానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయని రజనీష్ కుమార్ చెప్పారు. యస్ బ్యాంకుపై నెల రోజుల పాటు మారటోరియం విధించగా ఆ గడువు ఏప్రిల్ 3 వరకు ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆ లోపే అన్ని పరిష్కారమవుతాయని రజనీష్ అభిప్రాయపడుతున్నారు. ఎస్బీఐ ప్రారంభ పెట్టుబడి రూ.2,450 కోట్లుగా ఉంటుందని, రూ.10,000 కోట్ల వరకు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.