రూ.8,462కోట్ల నిధుల సమీకరణ, కొత్త వారికి యస్ బ్యాంక్ బోర్డులో స్థానం
ప్రయివేటురంగ యస్ బ్యాంకు డిసెంబర్ నెలలోగా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రక్రియను పూర్తి చేయనుంది. అలాగే కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం కొందరు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని యస్ బ్యాంకు తెలిపింది.
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, 33 శాతం దూసుకెళ్లిన యస్ బ్యాంక్ షేర్లు
నార్త్ అమెరికన్ ఫ్యామిలీస్ ఆఫీస్ ఇప్పటికే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్ ఇచ్చింది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.8,462 కోట్లకు పైగా. దీనిపై నవంబర్ నెలాఖరులో ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉందని యస్ బ్యాంకు సీఈవో తెలిపారు. ఆ సంస్థ నుంచి లేదా ఇతర ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబర్ నాటికి నిధుల సమీకరణ చేస్తామన్నారు.
రుణవృద్ధిని మెరుగుపర్చుకోవాలని నిర్దేశించుకున్నందున రానున్న రెండేళ్ల అవసరాలకు ఈ ఫండ్స్ సరిపోతాయని భావిస్తున్నట్లు సీఈవో తెలిపారు. మరోవైపు, సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో నిరర్థక ఆస్తులు పెరిగేందుకు కొన్ని సంస్థలకు ఇచ్చిన రుణాలు అకస్మాత్తుగా ఒత్తిడికి గురవ్వడమే కారణమని యస్ బ్యాంకు తెలిపింది.
కేఫ్ కాఫీ డే, సీజీ పవర్, కాక్స్ అండ్ కింగ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాల వల్ల తమపై ఒత్తిడి పెరిగిందని సీఈవో తెలిపారు. ఈ సంస్థలకు ఇచ్చిన రుణాలు రూ.4000 కోట్లు వసూలు కాలేదన్నారు. దీంతో పెట్టుబడి గ్రేట్ తక్కువగా ఉన్న పెట్టుబడుల విలువ రూ.29,000 కోట్ల నుంచి రూ.31,000 కోట్లకు చేరిందన్నారు. భవిష్యత్తులో లోన్ బుక్ మరింత పెరగకపోవచ్చునన్నారు.
ఇదిలా ఉండగా సింగపూర్ సంస్థ DBS తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందని వచ్చిన వార్తలను యస్ బ్యాంకు సీఈవో కొట్టి పారేశారు. DBS కూడా ఈ వార్తల్ని ఖండించింది.