ఆర్బీఐకి రూ.50,000 కోట్లు చెల్లించిన యస్ బ్యాంక్, వర్చువల్ భేటీతో రూ.90 లక్షలు ఆదా
స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ(SLF) బకాయిలు రూ.50,000 కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంకు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించింది. ఈ మేరకు యస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్బీఐ ఈ నిధులను అందించింది. అయితే ఈ మొత్తాన్ని గడువు కంటే ముందుగానే సెప్టెంబర్ 8వ తేదీన ఆర్బీఐకి చెల్లించింది. ఆర్బీఐకి ఎస్ఎల్ఎఫ్ నిధులు ముందుగానే చెల్లించినందుకు సంతోషంగా ఉందని వర్చువల్ వార్షిక సాధారణ సమావేశంలో షేర్ హోల్డర్లకు మెహతా తెలిపారు. బ్యాంకు స్థిరమైన వృద్ధికి మూడు కీలక స్తంభాల్లో పాలన ఒకటి అన్నారు.
ఆ రోజే ఆదేశాలు: రుణగ్రహీతలకు సుప్రీం ఊరట, మారటోరియం రద్దుపై కమిటీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10,000 కోట్ల బెయిలవుట్ అందించిందని, ఈ సంవత్సరం సరికొత్తగా ముందుకు సాగుతామని అభిప్రాయపడ్డారు. యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ, ప్రభుత్వం.. బ్యాంకు బోర్డును రీప్లేస్ చేసింది. డిపాజిటర్లకు కొన్ని రోజులు యాక్సెస్ లేకుండా నిలుపుదల చేశాయి. కొత్త బోర్డు వచ్చాక ఆంక్షలు ఎత్తివేశారు. కరోనా మహమ్మారి సమయంలో రూ.15,000 కోట్ల క్యాపిటల్ను సమీకరించింది. తద్వారా రుణ కార్యకలాపాలను పునరుద్ధరించింది.
ఇదిలా ఉండగా, యస్ బ్యాంకు.. ఎస్బీఐలో విలీనం అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎస్బీఐతో విలీనం కాదని వెల్లడించారు. బ్యాంకు మొదటి క్వార్టర్లో 20 శాతం ఖర్చులను తగ్గించుకోగలిగిందని తెలిపారు. మీడియం, దీర్ఘకాలిక వ్యయ హేతుబద్దీకరణ కోసం కన్సల్టెంట్ను నియమించినట్లు సీఈవో తెలిపారు. అంతేకాదు, వర్చువల్ సమావేశం నిర్వహించడం వల్ల బ్యాంకుకు రూ.90 లక్షలు ఆదా అయినట్లు తెలిపారు. గత ఏడాది ఏజీఎం సమావేశానికి రూ.1 కోటి కాగా, ఈసారి రూ.10 లక్షలు అయ్యాయన్నారు.