ఆర్బీఐ ఆంక్షలు: యస్ బ్యాంకు షేర్ లక్ష్యం రూ.1, SBI టేకోవర్ చేస్తుందా.. ఎలా?
యస్ బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. నగదు విత్ డ్రాపై పరిమితి విధించింది. మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కస్టమర్లు రూ.50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. అత్యవసరమైతే మాత్రం తగిన ఆధారాలతో ఆర్బీఐ అనుమతితో మరికొంత మొత్తం తీసుకోవచ్చు. నెల రోజులపాటు విత్ డ్రాలపై మారటోరియం విధించింది. ఏప్రిల్ 3 తర్వాత మారటోరియం ఎత్తివేస్తారు. యస్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్పై నిఘా పెట్టింది.
ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా: రూ.50,000 కి మించి నగదు విత్ డ్రా చేయలేరు!
ఎస్బీఐ-ఎల్ఐసీ టేకోవర్
ఆర్బీఐ మారటోరియం ప్రకటించడానికి ముందు యస్ బ్యాంకును ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సారథ్యంలోని కన్సార్టియం టేకోవర్ చేయనుందని వార్తలు వచ్చాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లుగా కూడా వార్తలు వెలువడ్డాయి. కన్సార్టియం 49 శాతం వాటాలు కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయి. నియంత్రణ అధికారం ఉండేలా వాటాలు కొనుగోలు చేసేందుకు త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చునని అంటున్నారు. ఎల్ఐసీకి ఇప్పటికే యస్ బ్యాంకులో 8 శాతం వాటా వరకు ఉంది.
కొద్ది రోజులకే ఈ పరిణామం
గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు కూడా సమావేశమైంది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదని ఇటీవల ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రయివేటు బ్యాంకులు.. యస్ బ్యాంకును టేకోవర్ చేసేందుకు అనువైనవని రజనీష్ అభిప్రాయపడ్డారు. ఈ వార్తలపై ఎస్బీఐ, యస్ బ్యాంకులను స్టాక్ ఎక్స్చేంజీలు వివరణ కోరాయి.
ఎస్బీఐలో సవరణలు అవసరం..
యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేయడానికి ఎస్బీఐ యాక్ట్లో కూడా సవరణలు అవసరం. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ఈ సవరణలకు ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వానికి అవకాశమని అంటున్నారు. అయితే ఏదైనా ఉంటే సెబి నిబంధనల మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇస్తామని ఎస్బీఐ తెలిపింది. ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లేదా ఎస్బీఐ నుండి ఎలాంటి సమాచారం లేదని యస్ బ్యాంకు తెలిపింది.
చాన్నాళ్లకు బెయిలవుట్..
ప్రయివేటు రంగ యస్ బ్యాంకును ఎస్బీఐ బెయిలవుట్ చేస్తే.. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు బెయిలవుట్ ఇవ్వడం చాన్నాళ్ల తర్వాత తొలిసారి అవుతుంది. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓబీసీ, 2006లో యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంకును ఐడీబీఐ టేకోవర్ చేశాయి. 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికా వంటి వివిధ దేశాల్లో ప్రయివేటు సంస్థల బెయిలవుట్కు ప్రజాధనాన్ని వినియోగించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
సూత్రప్రాయ అంగీకారం..
ఇదిలా ఉండగా, యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు ఎస్బీఐ సూత్రప్రాయంగా సమాచారం ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
యస్ బ్యాంకు షేర్ ధర రూ.1
క్లిష్ట పరిణామాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ యస్ బ్యాంకు షేరు లక్ష్యాన్ని రూ.1కి అంచనా వేసింది. అంతకుముందు రూ.55 అంచనా వేసింది. డిపాజిట్ల నష్టాలు, ఒత్తిడిలో ఉన్న లోన్ బుక్కు సంబంధించిన నష్టభయాల కారణంగా బ్యాంకులో వాటా దాదాపు సున్నా విలువతో ఇన్వెస్టర్లు కొంటారని అంచనా వేసింది. నెట్ వర్త్ బలహీనంగా ఉన్నట్లు తెలిపింది.