కస్టమర్లకు అంత వడ్డీ ఇవ్వలేం, రూ.10,000 కోట్లు వసూలు: యస్ బ్యాంకు
యస్ బ్యాంకు లెక్కలు అన్నీ సరిగ్గానే ఉన్నాయని, ఫోరెన్సిక్ ఆడిట్ అవసరం లేదని యస్ బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన ప్రశాంత్ కుమార్ తెలిపారు. నిధుల లభ్యత విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం నుంచి బ్యాంకు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంకు సీఎఫ్ఓ అశుతోష్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఏటీఎంలు, శాఖల్లో సరిపడా నిధులు
యస్ బ్యాంకు ఈరోజు నుండి బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించడం కస్టమర్లకు శుభవార్తే. తాము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, తమ ఏటీఎంలలో సరిపడా నగదు నిల్వలు ఉంచామని, అలాగే, శాఖలన్నింటికి తగినస్థాయిలో నగదు సరఫరా ఉందని, కాబట్టి బ్యాంకుకు సంబంధించి నిధులపరంగా ఏ సమస్య లేదన్నారు. బయటి నుండి నిధులు సమీకరించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే నిధులు సమకూర్చుకునే మార్గాలు ఉన్నాయన్నారు.
అంత వడ్డీకి హామీ ఇవ్వలేం
బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేసిన తర్వాత కస్టమర్లు పూర్తి స్థాయిలో బ్యాంక్ సేవలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. మారటోరియం వ్యవధిలో నిర్దిష్ట పరిమితి రూ.50,000 స్థాయిలో ఉపసంహరించుకున్న వారి సంఖ్య ఖాతాదారుల్లో మూడోవంతు మాత్రమే ఉండవచ్చునని చెప్పారు. సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న అత్యధిక 5-6 శాతం వడ్డీని కొనసాగించడంపై హామీ ఇవ్వలేమన్నారు. అయితే మారటోరియం ఆంక్షలు తొలగింపుతో బ్యాంకు శాఖలకు ఖాతాదారులు డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అదే సమయంలో యస్ బ్యాంకు సంక్షోభ సమయంలో ఓపికతో ఉన్నందుకు కస్టమర్లకు ప్రశాంత్ కుమార్ థ్యాంక్స్ చెబుతూ లేఖలు పంపించారు.
13 రోజుల్లో సంక్షోభం నుండి బయటకు..
కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర ఆర్థిక సంస్థల అండతో 13 రోజుల్లోనే సంక్షోభం పరిష్కారమైందని ప్రశాంత్ కుమార్ తెలిపారు. యస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు బ్యాంకు బోర్డును రద్దు చేసి వ్యవహారాలు పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఎస్బీఐ మాజీ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్ను నియమించింది. బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి.
రూ.8500 కోట్ల నుంచి రూ.10000 కోట్లు వసూలు కావొచ్చు
మార్చి క్వార్టర్లో రూ.8500 కోట్ల నుండి రూ.10000 కోట్ల మేర వసూలవుతాయని భావిస్తున్నట్లు ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే మొండి బకాయిల కోసం 72 శాతానికి పైగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. కొత్త మొండి బకాయిలు కూడా ఇంతకుముందు ప్రకటించిన 5 శాతానికి మించి ఉండకపోవచ్చునన్నారు.
దానిపై నో కామెంట్
అదనపు టైర్ 1 బాండ్ల వ్యవహారంపై ప్రశాంత్ కుమార్ స్పందిస్తూ ఇప్పటికే ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎక్కువగా చర్చించకూడదన్నారు. చిన్న ఇన్వెస్టర్లకు షేర్ల లాకిన్ పీరియడ్కు సంబంధించిన విషయంపై కూడా ఆయన నుండి స్పష్టమైన సమాధానం రాలేదు.
రిటైల్ విభాగం నుండి..
పాజిట్స్, లోన్లలో 60 శాతం వాటాను రిటైల్ విభాగం నుంచి రాబట్టాలని తమ సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. యస్ బ్యాంకుకు ప్రస్తుతం ఉన్న మొండి బకాయిల్లో 90 శాతం పైగా బాకీలు డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల్లో జత అయినవి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో రూ. 36,764 కోట్ల మేర మొండి బకాయిలు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్లో స్థూల మొండిబాకీలు రూ. 40,709 కోట్లకు, ప్రొవిజనింగ్ రూ. 29,594 కోట్లకు పెరిగాయి.
ఏ బ్యాంకు వాటా ఎంత అంటో?
కాగా, యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో ICICI 7.97 శాతం వాటాను, HDFC 7.97 శాతం, యాక్సిస్ 4.78 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ చెరో 2.39 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 1.99 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఎస్బీఐకి 49 శాతం వాటా ఉండనున్నాయి. తొలి విడత ఫండింగ్లో 42 శాతం, రెండో విడత ఫండింగ్ ద్వారా 49 శాతానికి పెంచుకోనుంది.