YES bank crisis: ఎస్బీఐ ముందుకు వచ్చిందంటే.. చైర్మన్ కీలక వ్యాఖ్యలు
యస్ బ్యాంక్ సంక్షోభంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ మారటోరియం విధించిన డెడ్ లైన్ ఏప్రిల్ 3వ తేదీలోపు సంక్షోభానికి ముగింపు ఉండవచ్చునని, వారంలో మనీ విత్ డ్రా పరిమితులు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు
ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదు
యస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని రజనీష్ కుమార్ చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కావొచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కావొచ్చు, ప్రభఉత్వం కావొచ్చు.. దేనికది ఓ నిర్ణయాన్ని హడావుడిగా తీసుకోలేవని అభిప్రాయపడ్డారు. ఈ మూడు వ్యవస్థలు సమష్టిగా ముందుకు సాగాలన్నారు.
రీక్యాపిటలైజేషన్
ఆర్బీఐతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. యస్ బ్యాంకు క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్ల నుండి రూ.22,000 కోట్ల వరకు ఉండవచ్చునని చెప్పారు. యస్ బ్యాంకును గట్టెక్కించేందుకు చాలామంది కో-ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు యస్ బ్యాంకు మనుగడ కీలకమన్నారు. రెగ్యులేటరీ క్యాపిటల్ రేషియోకు అనుగుణంగా ఉండేందుకు రీక్యాపిటలైజేషన్ ఉంటుందని చెప్పారు.
ఎస్బీఐ ముందుకు వచ్చిందంటే..
ఎస్బీఐ ముందుకు వచ్చిందంటే.. ఇక యస్ బ్యాంకు కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రజనీష్ కుమార్ చెప్పారు. ఎస్బీఐ అడుగు పెడితే యస్ బ్యాంకు పరిస్థితి యథావిధిగా ఉంటుందని హామీ ఇచ్చారు. యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ప్రమోటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్బీఐ.. యస్ బ్యాంకులో కో-ఇన్వెస్టర్గా మారనుందని చెప్పారు.
దూసుకెళ్లిన యస్ బ్యాంకు షేర్లు
యస్ బ్యాంకును ఎస్బీఐ ఆదుకుంటుందనే సంకేతాలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మారటోరియం విధించినప్పటికీ.. సోమవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ యస్ బ్యాంకు షేర్ మాత్రం లాభాల్లోకి వెళ్లింది. మిగతా షేర్లు పేకమేడలా కూలుతుంటే యస్ బ్యాంకు షేర్లు రాకెట్లా దూసుకెళ్లాయి. 49 శాతం వాటాను రూ.2,450 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీంతో ఇంట్రాడేలో యస్ బ్యాంకు షేర్ 41 శాతం పుంజుకొని, చివరకు 31.17 శాతం లాభంతో రూ.21.25 వద్ద ముగిసింది. ఎల్ఎస్ఈలో రూ.41.17 శాతం ఎగిసి రూ.22.80 వద్దకు చేరుకొని చివరకు 32.20 శాతం లాభంతో రూ.21.35 వద్ద క్లోజ్ అయింది.