Yes Bank crisis: అనిల్ అంబానీ సహా.. 10 పెద్ద కంపెనీల బ్యాడ్ లోన్లు రూ.34,000 కోట్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకును ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆదుకుంటుందని కస్టమర్లు, ఇన్వెస్టర్లు ఊరట చెందుతున్నారు. డిపాజిట్లను అక్రమ మార్గాల్లో తరలించినట్లుగా యస్ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో రానాకపూర్, అతని కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ దిశలో విచారణ సాగుతోంది. వారిపై మనీ లాండరింగ్ తదితర కేసులు పెట్టారు. యస్ బ్యాంకులో బ్యాడ్ లోన్లు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు
40 గ్రూప్లకు చెందిన 44 కంపెనీల బ్యాడ్ లోన్స్
ఫైనాన్షియల్ ఇండస్ట్రీ సోర్స్ ప్రకారం.. దాదాపు 10 పెద్ద బిజినెస్ గ్రూప్లకు చెందిన 44 కంపెనీలు యస్ బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాయి. వీటి బ్యాడ్ లోన్స్ వ్యాల్యూ దాదాపు రూ.34,000 కోట్లు.
అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్ లోన్లు
ఇందులో అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన 9 కంపెనీల ఎన్పీయేల వ్యాల్యూనే రూ.12,800 కోట్లుగా ఉందని తెలుస్తోంది. సుభాష్ చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్లోని 16 కంపెనీల బ్యాడ్ లోన్ల వ్యాల్యూ రూ.8,400 కోట్లుగా ఉంది.
DHFL, IL&FS, జెట్ ఎయిర్వేస్..
దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ (DHFL), ఈ గ్రూప్కు చెందిన బిలీఫ్ రియాల్టర్స్ ప్రయివేటు లిమిటెడ్ బ్యాడ్ లోన్లు రూ.4,735 ఉన్నాయి. IL&FS బ్యాంకు బ్యాడ్ రుణాలు రూ.2,500 కోట్లు ఉంది. గత ఏడాది మూతబడిన జెట్ ఎయిర్వేస్కు కూడా రూ.1,100 రుణాలు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మరిన్ని గ్రూప్స్..
కేర్కార్ గ్రూప్కు చెందిన కాక్స్ క్ష కింగ్స్, గో ట్రావెల్స్ రూ.1,000 కోట్లు, భారత్ ఇన్ఫ్రా, మెక్లియోడ్ రసెల్ అసోం టీ, ఎవరెడీ (బీఎం ఖైతాన్ గ్రూప్) రూ.1,250 కోట్లు, ఓంకార్ రియాల్టర్స్ అండ్ డెవలపర్స్ రెండు ప్రాజెక్టులకు రూ.2,710 కోట్లు, రేడియస్ డెవలరప్స్ రూ.1,200 కోట్లు, థాపర్ గ్రూప్కు చెందిన సీజీ పవర్ రూ.500 కోట్లు ఉన్నాయి.
ఒత్తిడిలో ఉన్న కంపెనీలే..
యస్ బ్యాంకు బ్యాడ్ లోన్లు అన్ని కూడా ఒత్తిడిలో ఉన్న గ్రూప్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇన్ప్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ సెక్టార్ వంటి రంగాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
నిర్మల సీతారామన్ ఏమన్నారంటే.. వారే కారణం..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎన్డీయే హయాం కంటే ముందు ప్రయివేటు కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయని, ప్రస్తుత యస్ బ్యాంకు సంక్షోభానికి వారే కారణమని చెప్పారు. నాటి వైఫల్యమే నేడు ఆర్బీఐ ఆ బ్యాంకుపై మారటోరియం విధించేందుకు కారణమైందని చెప్పారు.