Yes Bank crisis: 6నెలల్లో రూ.18,000 కోట్లు వెనక్కి, TTD దారిలోనే కంపెనీలు
ఏడాది కాలంగా యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. షేర్లు ఆకాశం నుండి పాతాళానికి పడిపోయాయి. నాలుగు రోజుల క్రితం ఆర్బీఐ మారటోరియం విధించిన తర్వాత షేర్లు ఓ సమయంలో రూ.6కు పడిపోయాయి. అయితే ఎస్బీఐ, ఎల్ఐసీ ఆదుకుంటుందనే సంకేతాల నేపథ్యంలో కుదురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో డిపాజిటర్లు కేవలం ఆరు నెలల కాలంలో వేలాది కోట్లు వెనక్కి తీసుకున్నారు.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు
6 నెలల్లో రూ.18,000 కోట్లు వెనక్కి
యస్ బ్యాంకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్తో, ఎన్పీఏలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య.. ఆరు నెలల కాలంలో డిపాజిటర్లు ఏకంగా రూ.18,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. 2019 అక్టోబర్ నుండి 2020 ఫిబ్రవరి మధ్య మరో 10 శాతం నుండి 20 శాతం వరకు విత్ డ్రాల్స్ ఉండటాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు.
రూ.2.27కోట్ల నుండి రూ.2.09 కోట్లకు తగ్గుదల
యస్ బ్యాంకు యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం డిపాజిట్లు మార్చి 31, 2019 నాటికి రూ.2,27,610 కోట్లు కాగా, సెప్టెంబర్ 2019 నాటికి రూ.2,09,497 కోట్లకు తగ్గాయి. అంటే 8.64 శాతం డిపాజిట్లు పడిపోయినట్లు. ఇది దాదాపు రూ.18వేల కోట్లు. అదే సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇతర బ్యాంకుల డిపాజిట్లు 9.2 శాతం మేర పెరిగాయి.
డిపాజిట్లు అలా పెరిగి... ఒక్కసారిగా..
యస్ బ్యాంకు డిపాజిట్లు 2014 మార్చి నాటికి రూ.74,192 కోట్లు, 2015లో రూ.91,176 కోట్లు, మార్చి 2016లో 1,11,720 కోట్లు, మార్చి 2017లో 1,42,874 కోట్లు, మార్చి 2018లో 2,00,738 కోట్లు, 2019 మార్చిలో రూ.2,27,610 కోట్లుగా ఉన్నాయి. ప్రతి ఏడాది వేగంగా పెరిగిన డిపాజిట్లు 2019 మార్చి తర్వాత ఆరు నెలలు మాత్రం భారీగా తగ్గి రూ.2,09,497 కోట్లకు తగ్గిపోయాయి. ఆ తర్వాత మరింత తగ్గి ఉంటాయని భావిస్తున్నారు.
డబ్బు తీసుకున్న గుజరాత్ కంపెనీ
అక్టోబర్ 2019 నాటి నుండి యస్ బ్యాంకు విత్ డ్రాల లెక్కలు తెలియాల్సి ఉంది. సంక్షోభం కారణంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు వెల్లడించలేదు. గుజరాత్కు చెందిన ఓ పెద్ద పారిశ్రామిక గ్రూప్ నెల రోజుల క్రితం తమ అమౌంట్ మొత్తం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం సహా...
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన రూ.1300 కోట్లు కూడా అక్టోబర్ 2019లో వెనక్కి తీసుకున్నారు. అలాగే వడోదర స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కంపెనీ రూ.265 కోట్లు తీసేసుకుంది. అంటే వివిధ సంస్థలు తమ డిపాజిట్లు వందలు, వేల కోట్లు వెనక్కి తీసుకున్నాయి. దీంతో డిపాజిట్లు భారీగా తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు.
డొల్ల కంపెనీలు..
కాగా, యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ, సీఈఓ రానాకపూర్ను కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. బ్యాంకు సొమ్మును ఇష్టమైన వారికి రుణాలుగా ఇచ్చి ముడుపులు తీసుకున్నాడనే ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (PMLA) కింద అరెస్ట్ చేసిన రానాను 11వ తేదీ వరకు కస్టడీలో ఉంచి విచారించేందుకు ముంబైలోని సెషన్స్ కోర్టు ఈడీ అధికారులను అనుమతించింది. రానా, ఆయన కుటుంబ సభ్యుల నిర్వహణలోని ఇరవైకి పైగా డొల్ల కంపెనీలు, వాటిలో పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన కస్టడీ అవసరమన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు అనుమతించింది.
రూ.2000 కోట్ల పెట్టుబడుల వివరాలు
మరోవైపు కపూర్ భార్య, ఆయన ముగ్గురు కుమార్తెల వాంగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులపై ముంబైలోని రానా నివాసంలో గురువారం రాత్రి ప్రారంభమైన ఈడీ సోదాలో ఎన్నో వివరాలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ సోదాల్లో ముడుపులు తీసుకునేందుకు రానా కుటుంబం ఏర్పాటు చేసిన 20కిపైగా డొల్ల కంపెనీలు, వాటిల్లో రూ.2,000 కోట్ల పెట్టుబడుల వివరాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన 44 పేయింటింగ్స్ కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని పెయింటింగ్స్ను కొంతమంది రాజకీయ నేతల నుంచి కొన్నారని తెలుస్తోంది.