యస్ బ్యాంకు కేసు: రానాకపూర్ రూ.127 కోట్ల లండన్ అపార్ట్మెంట్ అటాచ్
యస్ బ్యాంకు కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) బ్యాంకు ప్రమోటర్ రానాకపూర్కు చెందిన రూ.127 కోట్ల లండన్ అపార్టుమెంట్ను అటాచ్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. ఈ స్కాంకు సంబంధించి ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. రానా కపూర్తో పాటు పలువురిపై మనీ లాండరింగ్ కేసు నమోదయింది. లండన్లోని 1, 77 సౌత్ ఆడ్లే స్ట్రీట్, లండన్ అడ్రస్ కలిగిన అపార్టుమెంట్ను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రొవిజనల్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది.
మరో బ్రిటన్ కంపెనీ కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ యత్నం!
లండన్ ఆస్తిని ఇతరులకు ఇచ్చే ప్రయత్నం
ఈడీ అటాచ్ చేసిన ఈ లండన్ ఫ్లాట్ మార్కెట్ వ్యాల్యూ 13.5 మిలియన్ పౌండ్లు (రూ.127 కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద దీనిని అటాచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఆస్తిని రానా కపూర్ 2017లో 9.9 మిలియన్ పౌండ్లకు (రూ.93 కోట్లు) కొనుగోలు చేశారు. దీనిని డీవోఐటీ క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరున కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ ప్రయోజనకారి అతనే అని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. లండన్లోని ఈ ఆస్తిని ఇతరులకు అప్పగించేందుకు రానా కపూర్ ప్రయత్నిస్తున్నాడని ఈడీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇందుకోసం అతను పేరున్న కన్సల్టెంట్ను నియమించినట్లుగా కూడా గుర్తించిందని సమాచారం.
అమ్మవద్దు.. కొనవద్దు...
ఓపెన్ సోర్సెస్ నుండి జరిపిన విచారణలో ఈ ఆస్తి అమ్మకం కోసం అనేక వెబ్ సైట్లలో పెట్టినట్లు దర్యాఫ్తు సంస్థ గుర్తించింది. ఇక, ఈ అటాచ్మెంట్ ప్రక్రియ పూర్తి కావడానికి యునైటెడ్ కింగ్డమ్లోని అధికారిక ఏజెన్సీలను సంప్రదిస్తుంది. ఆ తర్వాత ఈ ఆస్తిని అమ్మడం లేదా కొనుగోలు చేయడాన్ని నిరోధిస్తుంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడి ఇదివరకు అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియాలలోని ఆస్తులను అటాచ్ చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ను స్టడీ చేసిన అనంతరం ఈడీ రానా కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై పీఎంఎల్ఏ చట్టం కింద బుక్ చేసింది. రానా కపూర్కు లబ్ధి చేకూరేలో యస్ బ్యాంకు గతంలో పలు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
అనుమానిత రుణాలు..
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం ఏప్రిల్-జూన్ 2018 సమయంలో యస్ బ్యాంకు లిమిటెడ్ రూ.3,700 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ షార్ట్ టర్మ్ డిబెంచర్లో ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన కపిల్ వాధవాన్.. రానా కపూర్, అతని కుటుంబానికి చెందిన డీవోఐటీ అర్బన్ వెంచర్స్(ఇండియా)కు రూ.600 కోట్ల రుణం అందించారు. అంతేకాకుండా డీహెచ్ఎఫ్ఎల్ కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్, ఇతని కుటుంబానికి చెందిన ఆర్కేడబ్ల్యు డెవలపర్స్కు యస్ బ్యాంకు రూ.750 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణాన్ని ముంబైలోని బాంద్రా రిక్లెమేషన్ ప్రాజెక్టు కోసం ఇచ్చారు. కానీ ఈ మొత్తాన్ని షెల్ కంపెనీ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి రానా కపూర్, కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్లను ఈడీ అరెస్ట్ చేసింది. వారు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.