Recession Soon: మాంద్యం తప్పదంటున్న WTO.. జర్మనీలో ఇప్పటికే స్టార్ట్.. భారత్ పరిస్థితి..?
Recession Soon: ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ఇది గత కొన్ని నెలలుగా వింటున్న మాటే కథ అని అందరూ భావించవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం పరిస్థితులు చేజారిపోతున్నాయని అనేక మంది నిపుణులు వరుస హెచ్చరికలు చేయటం అప్రమత్తత ముఖ్యమని చెబుతున్నాయి. ఇదే విషయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) డైరెక్టర్ జనరల్ నెగోజి ఒకోంజో ఇవేలా సైతం జెనీవై వేదికగా హెచ్చరించారు.
మాంద్యాన్ని లైట్ తీసుకోవద్దు..
జెనీవాలో డబ్ల్యూటీవో వార్షిక పబ్లిక్ ఫోరం ప్రారంభ కార్యక్రమంలో ఒకోంజో ప్రస్తుతం మాంద్యం వైపు పయనిస్తోందని అన్నారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని డబ్ల్యూటీవో చీఫ్ అన్నారు. వడ్డీ రేట్ల పెంపు తప్ప సెంట్రల్ బ్యాంకులకు ఇతర మార్గాలు లేవని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో ఆహార భద్రత ప్రపంచానికి పెద్ద సవాలుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పులతో..
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యానికి దగ్గరకు చేరుకున్న తరుణంలో.. ఇంధన కొరత, వాతావరణ మార్పులు, విపరీతంగా పెరుగుతున్న ఆహార ధరలు సంక్షోభాన్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచదేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు సైతం అనేక కారణాల వల్ల మందగించాయి. ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. యుద్ధం కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు తిరిగి సాధారణ స్థితికి రాకుంటే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జర్మనీ అతలాకుతలం..
యూరప్ లోని జర్మనీని మాంద్యం మబ్బులు కమ్మేశాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ముప్పుకు దగ్గరగా చేరుకుంటోంది. అయితే వాస్తవ పరిస్థితులు 2008 కంటే దారుణంగా మారాయని అక్కడి ఐఎఫ్ఓ సర్వే సూచీ వెల్లడించింది. రష్యా చర్యల కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. వీటి ధరల కారణంగా వ్యాపారులు సైతం తమ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. రష్యా నుంచి వచ్చే చవకైన గ్యాస్ పైప్ లైన్ నిలిచిపోవటంతో అమెరికా నుంచి లిక్విఫైడ్ గ్యాస్ ను జర్మనీ దిగుమతి చేసుకుంటోంది. అక్కడ తయారీతో పాటు విద్యుత్ ఉత్పత్తి సైతం తీవ్రంగా దెబ్బతింది.
భారత్ పరిస్థితి..?
అమెరి, యూరో జోన్లు మాంద్యం వైపు పయనిస్తున్నప్పటికీ.. భారతదేశం దాని ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P మంగళవారం వెల్లడించింది. భారత్ ఎక్కువగా ఇంధన దిగుమతిదారు అయినప్పటికీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ చాలా విడదీయబడిందని రేటింగ్ సంస్థ వ్యాఖ్యానించింది. తగినంత ఫారెక్స్ నిల్వలతో పాటు కంపెనీల పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నందుకు భారత్ కు ఇబ్బంది ఉండదని S&P గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఎఫ్ గ్రున్వాల్డ్ వెల్లడించారు.