World Environment Day 2022: పెట్రోల్పై ప్రధాని మోడీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్కు సంబంధించిన అనౌన్స్మెంట్ కావడం వల్ల ఆసక్తి నెలకొంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం విషయంలో తాము విజయం సాధించామని ఆయన ప్రకటించారు. ఇందులో తాము విధించుకున్న డెడ్లైన్ కంటే ముందే లక్ష్యాన్ని అందుకున్నట్లు చెప్పారు. పెట్రోలియం దిగుమతుల్లో ఇదొక కీలక మలుపుగా అభివర్ణించారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. 2022 చివరి నాటికి పెట్రోల్లో 10 శాతం మేర ఇథనాల్ను కలపాలని 2014లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. అయిదు నెలలు ముందుగానే తాము ఈ ఘనతను సాధించినట్లు ప్రకటించారాయన. ఇదో అద్భుత ప్రగతి అని వ్యాఖ్యానించారు.
సేవ్ సోయిల్ మూవ్మెంట్ కార్యక్రమంలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనేక చర్యలను తీసుకున్నామని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల అంశంలో ప్రపంచంలోనే కీలకంగా వ్యవహరించామని పేర్కొన్నారు. పెట్రోల్లో 10 శాతం మేర ఇథనాల్ను మిళితం చేయడం వల్ల 27 లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని అన్నారు. దీనితో పాటు 41,000 కోట్ల రూపాయల ఫారెక్స్ నిల్వలను నిలుపుకోగలిగామని వ్యాఖ్యానించారు.
వచ్చే తొమ్మిది సంవత్సరాల్లో 40 శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, టార్గెట్ కంటే ముందే దీన్ని అందుకుంటామనే ఆశాభావాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. ఈ ఎనిమిది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో 20,000 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణాన్ని పెంచామని చెప్పారు. సేవ్ సోయిల్ మూవ్మెంట్ను ఈ ఏడాది మార్చిలో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రారంభించారు.