సరికొత్త రికార్డుకు భారత విదేశీ మారకపు నిల్వలు, V షేప్ రికవరీ
భారత్లో విదేశీ మారకపు నిల్వలు 590 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అంతక్రితం ఏడాదితో 119 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇదే సమయంలో బాహ్య రుణాలు 554 బిలియన్ డాలర్లు ఉన్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కరోనా మగమ్మాకి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత 4 నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్దఎత్తున తరలివచ్చాయి.
వీ షేప్ రికవరీ
కరోనా మహమ్మారి అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ వీ షేప్ రికవరీని చూస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. గత నాలుగు నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయని, దీని ద్వారానే వెల్లడవుతోందన్నారు. భారత ఫారెక్స్ నిల్వలు గతంలో ఎన్నడూ లేనివిధంగా 590 బిలియన్ డాలర్లకు పెరిగాయని, ఇది అత్యధికమని, భారత్ ఇప్పుడు నెట్ క్రెడిటార్ అన్నారు. జీఎస్టీ వసూళ్లు భారత ఆర్థిక వ్యవస్థ రికవరీని సూచిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఎన్నో చర్యలు
భారత ఆర్థిక వ్యవస్థ రికవరీకి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల కరోనా వల్ల ఎక్కువ ప్రాణాలు పోకుండా కాపాడటంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిచ్చిందన్నారు. కరోనా సమయంలోను దేశంలోకి అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. భారత్ తిరిగి కోలుకుంటోందని, తన పాదాలపై నిలబడుతోందన్నారు. వీషేప్ రికవరీకి జీఎస్టీ వసూళ్లు నిదర్శనం అన్నారు. గత నాలుగు నెలలుగా నెలకు రూ. 1లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు దాటుతున్నట్లు తెలిపారు.
5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రతిపక్షాలు తప్ప ప్రజలంతా మెచ్చుకున్నారని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ.30.42 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.34.50 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. భారత్ త్వరలో 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.