80% విప్రో ఉద్యోగులకు గుడ్న్యూస్, వారికి మాత్రం ఒక ఏడాది వేతన పెంపు ఆగిపోయినట్లే!
బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఉద్యోగుల వేతనాలు పెండింగ్లో పెట్టాయి. చాలా కంపెనీలు వేతనాల్లో కోతలు కూడా విధించాయి. మరిన్ని కంపెనీలు ఉద్యోగాల కోత విధించాయి. ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఐటీ కంపెనీలు సహా వివిధ రంగాల్లో వేతనాలు నిలిపివేశారు. ఇప్పుడు కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో వేతనాల పెంపును అమలు చేస్తున్నారు. కార్యకలాపాలు పెరిగాయని, శాలరీ హైక్స్ ఉంటాయని ఐటీ సంస్థలు మూడు నాలుగు నెలల క్రితమే ప్రకటించాయి. వీటిని ఇప్పుడు అమలు చేయనున్నారు.
RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్
వీరికి వేతన పెంపు
భారత నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో జనవరి 1వ తేదీ నుండి దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు వేతనాలని పెంచనుంది. మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన వారికి పదోన్నతులు ఇవ్వనున్నారు. ప్రధానంగా జూనియర్ విభాగం (B3, అంతకంటే తక్కువ)లో వేతనాలు పెంచనున్నారని తెలుస్తోంది. మధ్యస్థాయి విభాగం (C1, అంతకంటే పైన)లోను వేతనాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అర్హత కలిగిన జూనియర్ ఉద్యోగులకు జనవరి 1 (2021) నుండి వేతన పెంపును అమలు చేయనున్నారని తెలుస్తోంది.
ఎంత పెరగవచ్చు
1.8 లక్షల మంది ఉద్యోగుల్లో బీ3 బ్యాండ్ ఉద్యోగులు 80 శాతం మంది ఉన్నారు. వీరికి జనవరి 1వ తేదీ నుండి వేతన పెంపు ఉండగా, మిడ్ లెవల్ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుండి వేతన పెంపు ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆఫ్-షోర్ ఉద్యోగులకు 6 శాతం నుండి 8 శాతం, ఆన్-సైట్ ఉద్యోగులకు 3 శాతం నుండి 4 శాతం వేతన పెంపు ఉండవచ్చునని తెలుస్తోంది. వేతన పెంపుపై విప్రో స్పందించాల్సి ఉంది.
ఏడాద వేతనం పెంపు ఆగిపోయింది
సాధారణంగా విప్రో వేతన పెంపు జూన్ నెల నుండి అమలులోకి వస్తుంది. కరోనా కారణంగా వేతనాల పెంపు ఆలస్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ సీ1 బ్రాండ్, అపై ఉద్యోగులు ఒక సైకిల్ (ఏడాది వేతన పెంపు)ను కోల్పోయినట్లే. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు అద్భుత పనితీరును కనబరిచారని విప్రో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికంలో బిజినెస్ మెట్రిక్స్ ఆధారంగా ఉద్యోగులకు వంద శాతం వేరియేబుల్ పే ఇవ్వనున్నట్లు తెలిపింది.
జూలై-సెప్టెంబర్ కాలానికి వంద శాతం వేరియేబుల్ పే అందించింది. బీ3 బ్యాండ్ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు డిసెంబర్ 1 నుండి ప్రమోషన్లు ఇచ్చింది. దాదాపు 7వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది. గత మూడేళ్లలో ఇదే అధికం. కాగా, విప్రో స్టాక్ ధర నేడు 1.41 శాతం లాభపడి రూ.363.50 వద్ద ముగిసింది.