విప్రో థర్డ్ క్వార్టర్ ఫలితాలు: 3% తగ్గిన ప్రాఫిట్, 2.75% పెరిగిన రెవెన్యూ
ఐటీ దిగ్గజం విప్రో మంగళవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి థర్డ్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ క్వార్టర్లో ఏకీకృత ప్రాఫిట్ 3.2 శాతం మేర తగ్గి రూ.2,462.90 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఆదాయం మాత్రం 2.73 శాతం పెరిగి రూ.15,470.50 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో రూ.15,100.60 కోట్లుగా ఉంది.
ఈ క్వార్టర్లో విప్రో ఆపరేటింగ్ మార్జిన్ 18.4 శాతంగా ఉంది. క్వార్టర్ టు క్వార్టర్ పరంగా 0.3 శాతం పెరిగింది. వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఫిబ్రవరి 4, 2020లోపు మధ్యంతర డివిడెండ్ అందించనుంది.
అన్ని బిజినెస్ యూనిట్లు, ప్రాంతాల నుంచి తమ బిజినెస్ వృద్ధి బాగుందని, తాము కస్టమర్ రిలేషన్షిప్, పెద్ద పెద్ద డీల్స్ దక్కించుకోవడంపై దృష్టి సారించామని విప్రో సీఈవో అబిదాలీ నీముచ్వాలా చెప్పారు. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 0.3 శాతం మేర పెరిగిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అన్నారు.
కంపెనీ ఐటీ సేవల వ్యాపారం ద్వారా 2,095 మిలియన్ డాలర్ల నుంచి 2,137 మిలియన్ డాలర్లు అంచనా వేస్తోంది. వృద్ధి పరంగా చూస్తే ఇది 0.0 శాతం నుంచి 2 శాతం వరకు ఉంటుంది. కాగా, కంపెనీ క్వార్టర్ 2 నెట్ ప్రాఫిట్ రూ.2,561.20 నమోదు చేసింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 7.27 శాతం ఎక్కువ. క్వార్టర్ 3 ఫలితాల నేపథ్యంలో మంగళవారం విప్రో షేర్లు 0.47 శాతం పెరిగి రూ.256 వద్ద నిలిచింది.