Wipro Q2 Result: విప్రో నెట్ ప్రాఫిట్ జంప్, సెకండ్ శాలరీ కూడా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) దిగ్గజం విప్రో లిమిటెడ్ బుధవారం బుధవారం FY22 రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ.2,931 కోట్లుగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన (Q2FY21)లో 19 శాతం వృద్ధి నమోదయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.2466 కోట్లు నమోదు చేసింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్(PAT) మాత్రం అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే (Q1FY22) 9 శాతం క్షీణించి రూ.3243 కోట్లుగా నమోదయింది. కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగి రూ.19,667 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 7.8 శాతం వృద్ధి చెందింది. ఐటీ సేవల నుండి వచ్చే ఆదాయం 29.5 శాతం పెరిగి రూ.19,378.38 కోట్లుగా ఉంది.
సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలో కొత్తగా 11,475 మంది ఉద్యోగులు జత కలిశారు. వీరిలో 8,150 మంది మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు. క్రితం త్రైమాసికంలో 15.5 శాతంగా ఉన్న ఉద్యోగుల వలసల రేటు 20.5 శాతానికి పెరిగింది. ఈ ఏడాది 30,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీరంతా 2023 ఆర్థిక సంవత్సరంలో చేరుతారు. రెండో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్ హర్షం వ్యక్తం చేశారు. తమ వ్యాపార వ్యూహాలు ఫలిస్తున్నాయనేందుకు ఈ ఫలితాలు నిదర్శనం అన్నారు.
అమెరికా డాలర్ టర్మ్స్లో ఐటీ సేవలలో వరుసగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేసి, 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయింది. రూపాయి టర్మ్స్లో ఐటీ సేవలు 8.1 శాతం లాభపడింది. విప్రో అంచనాల కంటే ఇది ఎక్కువ. డిసెంబర్ త్రైమాసికంలో రెవెన్యూ వృద్ధి రెండు శాతం నుండి నాలుగు శాతం ఉండవచ్చునని విప్రో అంచనా వేస్తోంది. కాగా, బీఎస్ఈలో గురువారం షేర్ 2.01 శాతం లాభపడి రూ.672.35 వద్ద ముగిసింది. విప్రో కంపెనీ ఉద్యోగుల్లో 80 శాతం మందికి ఈ క్యాలెండర్ ఏడాదిలో సెకండ్ శాలరీ హైక్ను పూర్తి చేసింది.
కాగా, టీసీఎస్ ఇటీవల ఫలితాలు ప్రకటించింది. దేశీయ సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) FY22 రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.9,624 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం లాభం రూ.8433 కోట్లతో పోలిస్తే ఇది 14.1 శాతం అధికం. అదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.40,135 కోట్ల నుండి 16.8 శాతం వృద్ధితో రూ.46,867 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 15.5 శాతంగా నమోదయింది.
కంపెనీ అన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. తయారీ విభాగంలో 21.7 శాతం, లైఫ్ సైన్సెస్ - హెల్త్ సంరక్షణలో 19 శాతం, రిటైల్, సీపీజీలో 18.4 శాతం, బ్యాంకింగ్-ఆర్థికసేవలు-బీమాలో 17 శాతం, కమ్యూనికేషన్-మీడియాలో 15.6 శాతం, టెక్నాలజీ సేవల్లో 14.8 శాతం వృద్ధి నమోదయింది. ఉత్తర అమెరికా వ్యాపారంలో 17.4 శాతం వృద్ధి నమోదు అయింది. యూకేలో 15.6 శాతం, ఐరోపాలో 13.5 శాతం వృద్ధి కనిపించగా, ఎమర్జింగ్ మార్కెట్ భారత్లో 20.1 శాతం వృద్ధి నమోదు చేసింది. లాటిన్ అమెరికాలో 15.2 శాతం, మద్య ప్రాచ్యం, ఆఫ్రికా 13.8 శాతం, ఆసియా పసిఫిక్ 7.6 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
కంపెనీ బోర్డు ఒక్కో షేర్కు రూ.7 ఇంటరిమ్ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో 52 వారాల గరిష్టస్థాయి రూ.3,990కి చేరుకుంది. అయితే క్రితం సెషన్ ముగింపు మాత్రం రూ.3,943 వద్ద ఉంది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.5 లక్షల కోట్లను దాటింది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో నికరంగా 19,690 మందిని నియమించుకుంది. దీంతో ఉద్యోగుల సంఖ్య 5,28,748కు చేరింది. గత ఆరు నెలల్లో 43,000 మంది కొత్త గ్రాడ్యుయేట్స్ను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఐటీ వలసల రేటు 11.9 శాతంగా ఉంది.