కరోనా వాక్సిన్ తయారు చేస్తున్న అమెరికా కంపెనీ లో అజిమ్ ప్రేమ్ జీ పెట్టుబడులు!
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించటమే కాదు.... అలాంటి వ్యాపార ఆలోచనలు ఉన్న స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడుల్లోనూ ముందుంటారు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వాక్సిన్ తయారు చేస్తున్న ఒక అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా లో అజీమ్ పెట్టుబడి పెట్టారు. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. దీంతో ప్రపంచానికి కరోనా వైరస్ వాక్సిన్ ను అందించగల సత్తా ఉన్న కంపెనీగా దానిని పేర్కొంటున్నారు.
చైనా లో మొదలైన మహమ్మారి కరోనా వైరస్ అక్కడి నుంచి ప్రపంచమంతా విస్తరించింది. అగ్ర రాజ్యం అమెరికాను సైతం పట్టి పీడించించి. అన్ని దేశాల కంటే అధికంగా అమెరికానే ఈ మహమ్మారి వల్ల నష్టపోయింది. సుమారు 15 లక్షల మందికి సోకి దాదాపు 93,000 మందిని పొట్టన బెట్టుకుంది. యూరోప్ దేశాలను కూడా వైరస్ విపరీతంగా నష్టపరిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50,00,000 మందికి సోకిన ఈ ప్రాణాంతక వైరస్ 3 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను తీసింది. రానున్న రోజుల్లో వైరస్ సోకిన వారి సంఖ్య కోటి కి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు.
బిజినెస్ లేదని కాదు...!: ఇండియాబుల్స్లో 2,000 మంది ఉద్యోగుల తొలగింత
ఆశలు రేపుతున్న మోడెర్నా...
అమెరికా కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ... కరోనా వైరస్ అభివృద్ధి లో చాలా ముందు వరుసలో నిలుస్తోంది. ఇప్పటికే ఇది కరోనా వాక్సిన్ కాండిడేట్ ఎంఆర్ఎన్ఏ-1273 ని అభివృద్ధి చేసింది. అంతే కాకుండా 45 మంది మనుషుల్లో ఈ వాక్సిన్ ను పరీక్షించింది కూడా. ఈ వాక్సిన్ తీసుకున్న 8 మందిలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల్లో అభివృద్ధి చెందిన లాంటి ఆంటీ జెన్లు వృద్ధి చెందినట్లు పేర్కొంది. దీంతో ఇక వాక్సిన్ పరీక్షలు పేజ్ -2, పేజ్-3 దశకు చేరుకుంటాయని ఆశిస్తున్నారు. ఈ కంపెనీ ఆర్ఎన్ఏ ఆధారిత వాక్సిన్ కాండిడేట్ ను అభివృద్ధి చేసింది. సాధారణంగా ఈ తరహా వాక్సిన్ లు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అంటారు.
25 - 30 మిలియన్ డాలర్లు...
మోడెర్నా అనే స్టార్టుప్ కంపెనీలో విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్ జీ సుమారు 25 మిల్లియన్ డాలర్ల నుంచి 30 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టారని సమాచారం. మన కరెన్సీ లో చూస్తే... సుమారు రూ 200 కోట్ల విలువ ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే అజీమ్ ప్రేమ్ జీ కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి సంస్థ ఈ మేరకు మోడెర్నా లో ఇన్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రేమ్ జీ పెట్టుబడి సంస్థ బృందం ఈ పెట్టుబడిలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రేమ్ జీ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. ఎంఐటి కి చెందిన ప్రఖ్యాత ప్రొఫెసర్, ఆవిష్కర్త అయిన రాబర్ట్ లాంగర్ మోడెర్నా లో ప్రాథమిక దశలోనే పెట్టుబడి పెట్టడం కూడా ఆ కంపెనీ పై ప్రేమ్ జీ కి గురి కుదిరిందని అంటున్నారు. పైగా అజీమ్ ప్రేమ్ జీ ప్రపంచంలో చవకగా ప్రజల ఇమ్మ్యూనిటి పెంచగలిగే పరిశోధన కంపెనీల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.
రూ 10,000 కోట్ల సమీకరణ...
కరోనా వాక్సిన్ అభివృద్ధి తో పాటు ప్రపంచవ్యాప్తంగా దానిని విక్రయించేందుకు గాను భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టాలని మోడెర్నా యోచిస్తోంది. ఇందుకోసం పబ్లిక్ ఇష్యూ కు వెళ్ళటం ద్వారా 1.34 బిలియన్ డాలర్ల (సుమారు రూ 10,000 కోట్లు) నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఈ కంపెనీ లో ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టిన వారికి ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. అజీమ్ ప్రేమ్ జీ కూడా ఇప్పటికే మోడెర్నా లో కొంత వాటా విక్రయించినట్లు సమాచారం. పబ్లిక్ ఇష్యూ తర్వాత పూర్తిగా వైలుగుతారా లేదా అందులో ఇన్వెస్టర్ గా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా... మోడెర్నా వాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నా అందుకు సంబంధించి పెద్ద ఎత్తున డేటా ను సమర్పించాల్సి ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఈ కంపెనీ జికా, నిఫా వైరస్ వాక్సిన్ల లోనూ పురోగతి సాధించటం విశేషం.