అటు బీమా, ఇటు పన్ను ఆదా: ఇక నెలన్నరే మిగిలివుంది, కాస్త గుర్తు పెట్టుకోండి!
వేతనం పొందుతున్నవారు తమకు లభించే మినహాయింపులను గరిష్టంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆదాయ పన్ను చట్టంలోని ఏ నిబంధన కింద ఎంత మేరకు పన్ను ప్రయోజనం లభిస్తుందో చూసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళిక రచించుకుంటారు. ఇక పన్ను మినహాయింపులు పొందే విషయంలో జీవిత, ఆరోగ్య బీమా పాలసీల పాత్ర కీలకమన్న విషయం తెలిసిందే. బీమా పాలసీల వల్ల అధికంగా పన్ను ప్రయోజనం పొందడమే కాకుండా జీవితానికి తగిన రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది.
అమ్మకాలు జోరుగా
పన్ను ఆదా కోసమే జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఆర్ధిక సంవత్సరం ముగిసే మార్చిలోపు ఈ పాలసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల పన్ను చెల్లిపుదారులకు సంబందించి ప్రభుత్వం కొత్త స్లాబులను తెచ్చినప్పటికీ బీమా పాలసీల అమ్మకాలకు గిరాకీ జోరుగానే ఉంటుందని బీమా కంపెనీలు భావిస్తున్నాయి.
సాధారణంగా బీమా పాలసీలు
సాధారణంగా బీమా పాలసీలు మార్చి త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. ఉదాహరణకు 2019 మార్చి లో బీమా పాలసీలను చూస్తే 2018 డిసెంబర్ కన్నా అధికంగా ఉన్నాయి. డిసెంబర్లో బీమా కంపెనీలు వసూలు చేసిన ప్రీమియం 18,237.84 కోట్ల రూపాయలు ఉంటే మార్చిలో ఇది ఏకంగా రెండింతలు పెరిగి 37,459 కోట్ల స్థాయికి చేరుకుంది. ఇదే కాలంలో అమ్ముడయినా పాలసీల సంఖ్య రెండింతలకు పైగా పెరిగి 25.15 లక్షల నుంచి 55.39 లక్షలకు చేరుకుంది. ఇదన్న మాట ఆర్ధిక సంవత్సరం చివర్లో బీమా పాలసీలు ఉండే డిమాండ్. జీవిత బీమా మండలి గణాంకాల ప్రకారం గత డిసెంబర్ లో ప్రీమియం వసూళ్లు 25,079 కోట్ల రూపాయలు ఉండగా.. ఈ ఏడాది జనవరిలో ప్రీమియం వసూళ్లు 20,623 కోట్లకు చేరాయి.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. కాబట్టి ఈ మినహాయింపులను పొందాలనుకుంటే తగిన స్థాయిలో బీమా పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపు దారుతో పాటు తన భాగస్వామి, పిల్లలకు సంబందించిన బీమా పాలసీలపై పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది.కాబట్టి ఇంకా నెలన్నరే మిగిలి ఉన్నందువల్ల మీరు కూడా తగిన విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది.
ఆధారాలు చూపాలి..
వేతనం పొందుతున్న వారు ముందుగా తమ మినహాయింపులకు సంబందించిన వివరాలను ముందుగానే తమ సంస్థకు అందించాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబందించిన ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అందుకే బీమా పాలసీలను ఆర్ధిక సంవత్సరం చివరి నెలలైనా ఫిబ్రవరి,మార్చిలో ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తమ పెట్టుబడులకు ఆధారంగా చూపడానికి వినియోగిస్తారు.
పన్ను స్లాబులు మారినా..
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ లో భాగంగా కొత్త పన్ను స్లాబులను ప్రకటించారు. వీటిని ఎంచుకునే వారు ఎలాంటి మినహాయింపులు పొందే అవకాశం ఉండదు. ఇప్పుడున్న విధానంలో అయితే పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఎక్కువ మంది పాత విధానానికే మొగ్గు చూపవచ్చని, ఫలితముగా బీమా పాలసీలకు డిమాండ్ కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ట్రెండ్ మారుతోందా..
బీమా కంపనీలు తమ టర్మ్ ప్లాన్లతో పాటు ఇతర సంపదను పెంచే ప్లాన్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నాయి. కాబట్టి వీటిని కస్టమర్లు ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటోంది.