Jayanthi Chauhan: టాటాలకు బిస్లరీ అమ్మకం వెనుక మహిళ.. రూ.7000 కోట్ల వ్యాపారం ఎందుకిలా..
Bisleri: బిస్లరీ వ్యాపారాన్ని టాటాలు హస్తగతం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ డీల్ విలువ సుమారు రూ.7000 కోట్లుగా ఉంది. నీటి వ్యాపారంలో అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. దీనివెనుక ఉన్న మహిళ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాపార విస్తరణ..
బిస్లరీని తదుపరి స్థాయి విస్తరణకు తీసుకెళ్లేందుకు తగిన వ్యక్తి లేనందునే కంపెనీని విక్రయించాలని నిర్ణయించినట్లు బిస్లరీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ చౌహాన్ తెలిపారు. అయితే ఆయన కుమార్తె జయంతి చౌహాన్ బిస్లరీ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించకపోవటం కూడా ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. అందుకే దశాబ్దాలుగా ఉన్న వ్యాపారాన్ని టాటాలకు విక్రయించాలని నిర్ణయించారు.
టాటా-బిస్లరీ..
శీతల పానీయాల వ్యాపారంలో రమేష్ చాలా అనుభవజ్ఞలు. తాజా ఒప్పందంతో రెండు సంవత్సరాల పాటు కంపెనీ నిర్వహణని చేపట్టి ఆ తర్వాత దానిని టాటా గ్రూప్ కు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. టాటా గ్రూప్ బిస్లరీని బాగా నడుపుతుందని సెలహన్ కొద్ది రోజుల క్రితం అన్నారు. కంపెనీని అమ్మటం బాధాకరంగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బిస్లరీకి వారసులు..
బిస్లరీ ఒక లాభదాయకమైన కంపెనీ. కంపెనీకి సారధ్యం వహిస్తున్న రమేష్ చౌహాన్ కు వారసురాలుగా ఒక కుమార్తె ఉంది. కానీ జయంతి ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేశారు. దీనికి తోడు ఆమె లండన్లో ఫోటోగ్రఫీ, ఆధునిక డిజైన్లో తన ఆర్ట్ కోర్సును పూర్తి చేశారు. అయితే 37 ఏళ్ల జయంతి చిన్నప్పటి నుంచి విదేశాల్లోనే గడిపారు. అలా ఆమె తన 24 ఏళ్ల వయస్సులో తండ్రి బాటలో వ్యాపారంలోని అడుగుపెట్టారు. అలా 2011లో ముంబై కార్యాలయాన్ని పర్యవేక్షించడం ప్రారంభించింది.
బిస్లరీ భవిష్యత్తు..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీ వ్యాపారాన్ని తరువాతి స్థాయికి తీసుకెళ్లేందుకు బిస్లరీని టాటాలకు విక్రయించాలని నిర్ణయించటం జరిగింది. జయంతి పూర్తి స్థాయిలో వ్యాపారంపై దృష్టి సారించలేకపోతున్నందున లాభదాయకంగా నడుస్తున్న కంపెనీని టాటాలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. రమేష్ చౌహాన్ 1969లో బిస్లరీ బ్రాండ్ను ఇటాలియన్ వ్యాపారవేత్త నుంచి ఈ కంపెనీని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కంపెనీకి మెుత్తం 133 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వ్యాపారాన్ని ముందుకు నడిపేందుకు కూతురు జయంతి నిరాకరించటంతో రమేష్ చౌహాన్ తాజా నిర్ణయం వెలువడింది.