అనూహ్యంగా కొద్దిరోజుల్లో బంగారం ధర రూ.2,000 ఎందుకు తగ్గింది? అప్పుడు మళ్లీ పెరుగుతుంది...
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతున్నాయి. మధ్యలో స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ సెప్టెంబర్లో రూ.40,000 మార్క్ దాటిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.2,000కు పైగా తగ్గింది. శుక్రవారం మార్కెట్లో 38,246 పలికింది. సోమవారం గోల్డ్ స్పాట్ ధర అహ్మదాబాద్లో రూ.38,096, గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.37,951గా ఉంది. రెండు నెలల కాలంలో ధర రూ.2వేల వరకు తగ్గింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు కారణాలు ఉన్నాయి.
ఆస్తులకు ఆధార్ లింక్!: మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!?
బంగారం ధర తగ్గడానికి పలు కారణాలు
అమెరికా, చైనా ట్రేడ్ టాక్స్ పైన నెలకొన్న ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. అలాగే, భారత్లో ఫెస్టివ్ సీజన్ అయిన ధన్ తెరాస్, దీపావళి వంటి పండుగలు అక్టోబర్ నెలలోనే కంప్లీట్ అయ్యాయి. మన దేశంలో ఈ పండుగ సమయంలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండుక తర్వాత తగ్గుతాయి. అలాగే, డాలర్ మారకంతో రూపాయి విలువ 72 లోపే ఉంటోంది. రూపాయి వ్యాల్యూ తగ్గినప్పుడు కూడా బంగరం ధర పెరుగుతుంది. కానీ రూపాయి స్థిరంగా లేకపోయినప్పటికీ 72 లోపు తచ్చాడుతోంది.
తగ్గిన బంగారం ధరలు...
గత రెండు నెలలుగా అంతర్జాతీయంగా ధరల్లో ఏర్పడుతున్న ఎగుడు దిగుడులకు ధీటుగా భారత్లో బంగారం ధరలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర 10 గ్రాముల 0.77 శాతం తగ్గి రూ.37,971, వెండి కాంట్రాక్టుల ధర 0.76 శాతం తగ్గి రూ.44,385 పలికింది. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో సోమవారం కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
85 డాలర్లు తగ్గిన బంగారం
సెప్టెంబర్ ప్రారంభంలో అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర 1,550 డాలర్లుగా ఉంది. ఇప్పుడు అది 1,465 డాలర్లకు దిగి వచ్చింది. అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందం మీద అతివిలువైన లోహాల ధరలు పెరగనున్నాయి. ఒప్పందం సానుకూలంగా లేకుంటే తిరిగి ధరలు పెరగవచ్చు. ఈ ఒప్పందం కారణంగానే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు నిస్తేజంగా ఉన్నాయని చెబుతున్నారు.
బంగారం పెట్టుబడులకు ఇదీ దూరం చేసింది.. ఎప్పుడు పెరుగుతుందంటే
మరోవైపు, ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లు మంచి ర్యాలీని సాధిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ సరికొత్త గరిష్టస్థాయి నమోదు చేసింది. ఇది ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది. ఔన్స్ బంగారం 1480 డాలర్లు దాటితే తప్ప మరోసారి ర్యాలీకి అస్కారం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అగ్ర దేశాల చర్చలు, బ్రెగ్జిట్ పరిణామాల ప్రభావం రానున్న కొద్ది నెలల్లో బులియన్ మార్కెట్ నిరాశగానే ఉండవచ్చునని విశ్లేషకుల అభిప్రాయం.
ఇటీవల తగ్గినా.. ఏడాదిలో భారీగా పెరిగిన ధర
సెప్టెంబర్ నుంచి బంగారం ధర రూ.2,000 వరకు తగ్గినప్పటికీ ఈ ఏడాదిలో మాత్రం ఇప్పటి వరకు అనూహ్యంగా 14 శాతం వృద్ధి (అంతర్జాతీయవ్యాప్తంగా) నమోదు కావడం గమనార్హం. భారత్లో ఏకంగా 20 శాతం పెరుగుదల నమోదయింది. రూ.33,000 నుంచి రూ.34,000 మధ్య ఉన్న బంగారం ధర అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే రూ.38,000 నుంచి రూ.40,000కు చేరుకుంది.