హోల్సేల్ ద్రవ్యోల్భణం 12.54%, ఐదు నెలల గరిష్టానికి: ఉల్లి 25% తగ్గుదల
భారత హోల్ సేల్ ద్రవ్యోల్భణం ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. ఈ మేరకు ఎకనమిక్ అడ్వైజర్, డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(DPIIT) సోమవారం హోల్ సేల్ ప్రైస్ డేటాను విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ద్రవ్యోల్భణం 12.54 శాతం (ప్రొవిజనల్) కు చేరుకుంది. 2020 అక్టోబర్ నెలతో పోలిస్తే ఇది 1.31 శాతం అధికం. తయారీ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. ఏప్రిల్ నుండి వరుసగా ఏడో నెలా ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదయింది. సెప్టెంబర్ నెలలో 10.66 శాతానికి తగ్గినప్పటికీ, మళ్లీ గత నెల పెరిగింది.
గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఆహార ఉత్పత్తులు, ముడి పెట్రోలియం, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 11.41 శాతంగా ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో 12.04 శాతానికి పెరిగింది. ఇంధన, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం 24.84 శాతం నుండి 37.18 శాతానికి, ముడి పెట్రోలియం 71.86 నుండి 80.57 శాతానికి పెరిగింది. మైనస్ 4.69 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో మైనస్ 1.69కి పెరిగింది. కూరగాయల ధరలు మైనస్ 18.49 శాతం, ఉల్లి ధరలు రూ.25.01 శాతం తగ్గాయి.
ప్రైమరీ ఆర్టికల్స్ ఇండెక్స్ 3.10 శాతం పెరిగి 159.7 (ప్రొవిజనల్)కు చేరుకుంది. సెప్టెంబర్ నెలలో ఇది ఇది 154.9 (ప్రొవిజనల్) శాతంగా నమోదయింది. ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్ 8.27 శాతం పెరిగి 124.7(ప్రొవిజనల్)గా నమోదయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఇండెక్స్ 0.82 శాతం పెరిగి 134.9 (ప్రొవిజన్)గా నమోదయింది.