8 ఏళ్ల గరిష్టానికి హోల్సేల్ ద్రవ్యోల్భణం, మార్చిలో 7.39 శాతం
హోల్సేల్ ద్రవ్యోల్భణం(WPI) మార్చి నెలలో ఎనిమిదేళ్ళ గరిష్టానికి చేరుకుంది. క్రూడాయిల్ ధరలు, మెటల్ ధరలు పెరగడంతో ఇది 7.39 శాతంగా నమోదయింది. ఫిబ్రవరి నెలలో WPI ద్రవ్యోల్భణం 4.17 శాతంగా ఉంది. మార్చి 2020లో ఇది 0.42 శాతంగా నమోదయింది. అయితే మార్చిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణం రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం.
మార్చి నెలలో 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరిన WPI ఫిబ్రవరి (4.17 శాతం))తో పోలిస్తే 3.22 శాతం ఎక్కువగా నమోదయింది. వరుసగా నాలుగో నెలలోనూ టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. గత ఏడాది మార్చితో పోలిస్తే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, లోహాల ధరలు పెరగడంతో డబ్ల్యూపీఐ ఈ స్థాయిలో పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది.
ఇంతకుముందు 2012 అక్టోబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం రికార్డ్ స్థాయిలో 7.4 శాతంగా నమోదయింది. వరి, పప్పు ధాన్యాలు, పండ్ల ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది మార్చిలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 3.24 శాతానికి ఎగసింది. గత నెలలో పప్పు ధాన్యాల టోకు ద్రవ్యోల్బణం 13.14 శాతంగా, పళ్ల ధరల సూచీ 16.33 శాతంగా, వరి ద్రవ్యోల్బణం 1.38 శాతంగా ఉంది.