నాలుగున్నరేళ్ల కనిష్టానికి హోల్సేల్ ధరలు, భారీగా తగ్గిన ఎగుమతులు
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా మే నెలలో ప్రతిద్రవ్యోల్భణస్థితి నెలకొంది. హోల్సేల్ ధరలు నాలుగున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇంధనం, విద్యుత్, పలు ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణ సూచీ (WPI-హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్) మైనస్ 3.21 శాతానికి దిగివచ్చింది. మార్చిలో ఇది 1 శాతంగా ఉంది. 2015 నవంబర్ తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. అప్పుడు ఈ సూచీ మైనస్ 3.7 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ WPI గణాంకాలు విడుదల చేసింది.
అనిల్ అంబానీ బకాయిలు రాబట్టడం ఎస్బీఐ, చైనీస్ బ్యాంకులకు అంత ఈజీ కాదు!
ఆయా ఆహార పదార్థాల ద్రవ్యోల్భణ రేటు
ఆహార పదార్ధాల ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 2.55 శాతం కాగా, మే నెలలో 1.13 శాతానికి తగ్గింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 12.31 శాతంగా ఉండగా, మే నెలలో 11.91 శాతానికి పడిపోయింది. కూరగాయల ప్రతిద్రవ్యోల్భణం మైనస్ 12.48 శాతానికి పడిపోయింది. అయితే బంగాళదుంప ద్రవ్యోల్భణ రేటు 52.25 శాతం పెరిగింది. ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తులైన గుడ్లు, మాంసం, చేపలు వంటి ద్రవ్యోల్భణ రేటు 1.94 శాతంగా ఉంది.
విద్యుత్, ఇంధన ధరల ద్రవ్యోల్భణం
మే నెలలో విద్యుత్, ఇంధన ధరల ద్రవ్యోల్భణం మైనస్ 19.83 శాతంగా కాగా, ఏప్రిల్ నెలలో మైనస్ 10.12 శాతంగా నమోదయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తుల రేటు మే నెలలో 0.42 శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా కరోనా - లాక్ డౌన్ కారణంగా ఎలక్ట్రానిక్ విధానంలో ధరల సమాచారాన్ని సేకరించినట్లు కేంద్రం తెలిపింది. ఎంపిక చేసిన సంస్థాగత వర్గాలు, పరిశ్రమల నుండి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వెబ్ సైట్ ద్వారా డేటాను తీసుకున్నామని పేర్కొంది.
తగ్గిన దిగుమతులు
మరోవైపు ఎగుమతులు కూడా వరుసగా మూడో నెలలో తగ్గాయి. మే నెలలో ఇవి 36.47 శాతం తగ్గి 19.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పెట్రోలియం, జౌళి, ఇంజినీరింగ్, రత్నాలు, ఆభరణాలు వంటి ప్రధాన రంగాల ఎగుమతులు భారీగా తగ్గాయి. దిగుమతులు కూడా 51 శాతం క్షీణించి 22.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఎగుమతులు, దిగుమతులు క్షీణించడంతో వాణిజ్య లోటు 31.5 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు నెలలో ఇది 15.36 బిలియన్ డాలర్లుగా ఉంది.