విజిల్ బ్లోయర్లు: కార్పొరేట్ లోకంలో.. కనిపించని హీరోలు!
కార్పొరేట్ లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎన్ని నియంత్రణ సంస్థలు ఉన్నా లోలోపల జరిగే అక్రమాలు, అవకతవకలు జరిగిపోతూనే ఉంటాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడనేది సామెత. అయితే ఇంటి దొంగ సంగతి బయటివాళ్లకన్నా ఇంట్లో వాళ్లకే బాగా తెలుస్తుంది. అలాగే కంపెనీల్లో ఏం జరుగుతుందనేది ఆ కంపెనీల్లో పనిచేసే వారికే తెలుస్తుంది. అయితే ధైర్యం చేసి వాటిని బయటపెట్టిన వాడే.. విజిల్ బ్లోయర్!
కార్పొరేట్ లోకంలో విజిల్ బ్లోయింగ్ ఇటీవలి కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. పీఎన్బీ స్కామ్ బయటికొచ్చినా, టీసీఎస్, ఇన్ఫోసిస్లాంటి దిగ్గజ కంపెనీల్లో అవకతవకలు బయటపడినా.. అదంతా కేవలం విజిల్ బ్లోయర్ల పుణ్యమే! అక్రమాలు, అవకతవకలను ధైర్యంగా వెలుగులోకి తీసుకురావడం ప్రశంసనీయమే.. కానీ ఆ తరువాత విజిల్ బ్లోయర్ల పరిస్థితి ఏంటి? వారి జీవితాలకు రక్షణ ఉంటుందా?
బయటికి కనిపించని హీరోలు...
ఏదైనా కంపెనీ అక్రమాలకు పాల్పడుతుంటే, వాటిని వెలుగులోకి తీసుకొచ్చేవారే ‘విజిల్ బ్లోయర్స్'. వీళ్లు కూడా ఉద్యోగులే.. కానీ అక్రమాలు, అన్యాయాలను సహించలేని వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అక్రమాల గురించి నియంత్రణ సంస్థలకు రహస్యంగా ఉప్పందిస్తారు. వీరిచ్చే సమాచారంతోనే నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి అక్రమాలు, అవకతవకలపై దర్యాప్తు జరుపుతాయి.. అవి వాస్తవమేనని రుజువైతే అవసరమైన చర్యలు కూడా తీసుకుంటాయి. అయితే విజిల్ బ్లోయర్లు ఉద్యోగులైన పరిస్థితుల్లో మాత్రం మన దేశంలో వారి మనుగడే ప్రమాదంలో పడుతోంది.
కంపెనీలపై పెరుగుతున్న ఫిర్యాదులు...
చాలా కంపెనీలపై ఇటీవల విజిల్ బ్లోయర్ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వీరి కంప్లెయింట్స్ వల్లే చాలా కార్పొరేట్ కంపెనీల్లో జరిగే స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీలోని కంపెనీలలో ఈ విజిల్ బ్లోయర్ ఫిర్యాదుల సంఖ్య అధికంగా ఉంది. అందులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విప్రో సంస్థలు ఈ విజిల్ బ్లోయర్ ఫిర్యాదుల్లో ముందంజలో ఉన్నాయి. 2018-19లో నిఫ్టీ టాప్ 10 కంపెనీలపై 4,552 ఫిర్యాదులు దాఖలయ్యాయి. 2017-18తో పోలిస్తే.. ఇవి 30 శాతం ఎక్కవ.
వెలుగులోకి ఎన్నో స్కామ్లు...
ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా.. తదితర కంపెనీల్లో అవకతవకలు ఇటీవలికాలంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి బయటికి రావడానికి కారణం విజిల్ బ్లోయర్స్. సన్ ఫార్మా కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఆరోపణలు రావడంతో.. ఆ కంపెనీపై ఫోరెన్సిక్ ఆడిట్కు సెబీ ఆదేశించింది. పీఎన్బీ బ్యాంక్లో నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీల స్కామ్ను బెంగళూరుకు చెందిన ఓ ఇన్వెస్టర్ విజిల్ బ్లోయర్గా వెలుగులోకి తెచ్చారు. ఇటీవల ఇన్ఫోసిస్ టాప్ అధికారులపై కూడా విజిల్ బ్లోయర్ కంప్లెయింట్స్ వచ్చాయి. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో స్కామ్లు విజిల్ బ్లోయర్ ఫిర్యాదుల వల్లే వెలుగులోకి వస్తున్నాయి.
కయ్యానికి కాలుదువ్వినట్లే...
అయితే కంపెనీలో పని చేసే ఉద్యోగే విజిల్ బ్లోయర్గా మారిన సమయంలో వారి పరిస్థితి చాలా కష్టంగా ఉంటోంది. ఒకవేళ అదో పెద్ద కంపెనీ అయితే ఆ విజిల్ బ్లోయర్ జీవితం ప్రమాదంలో పడ్డట్లే. ఆ తరువాత నుంచి కంపెనీ యాజమాన్యానికి, ఆ ఉద్యోగికి మధ్య జరిగే వార్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఉద్యోగావకాశాలు కోల్పోతారు. కెరీర్ నాశనం అవుతుంది. ఇలా ఇప్పటివరకు చాలా మంది విజిల్ బ్లోయర్లు చాలా చాలా నష్టపోయారు కూడా.
పీడబ్ల్యూసీ ఇండియాలో ఇలా...
ఉదాహరణకు.. పీడబ్ల్యూసీ ఇండియాలో పని చేసిన సర్వేష్ మాథూర్ అనే మాజీ సీఎఫ్వో ఇదే రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. పీడబ్ల్యూసీ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఉల్లంఘిస్తోందంటూ మాథూర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిధులను ఇండియాకు తీసుకొస్తోందని పేర్కొంటూ ఆ కన్సల్టెన్సీ సంస్థలో జరిగే మోసాలను ఆయన వెలుగులోకి తెచ్చారు. దీంతో ఈడీ 2019 సెప్టెంబర్లో ఆ కంపెనీపై రూ.230 కోట్ల పెనాల్టీ వేసింది. అయితే ఈ స్కామ్ను వెలుగులోకి తెచ్చిన మాథూర్ మాత్రం తీవ్రంగా నష్టపోయారు. పీడబ్ల్యూసీ ఆయనను ఉద్యోగం నుంచి బలవంతంగా తొలగించింది. ఆ తరువాత ఆయనకు మరో ఉద్యోగం దొరకడం కూడా కష్టమైంది.
‘క్యాడ్బరీ ఇండియా'లో ఏం జరిగిందటే...
క్యాడ్బరీ ఇండియాలో పనిచేసిన రాజన్ నాయర్దీ ఇదే పరిస్థితి. పన్ను ప్రయోజనాలను పొందడం కోసం పర్మిషన్ లేకుండా హిమాచల్లోని బద్ది వద్ద రెండో యూనిట్ను ఆ కంపెనీ నిర్మించడంపై ఆయన ఆరోపణలు లేవనెత్తారు. ఈ ఆరోపణలు నిజమని తేలిన నేపథ్యంలో క్యాడ్బరీకి భారీ పెనాల్టీ పడింది. పన్నుల కింద రూ.342 కోట్లు కట్టాలని, అదేవిధంగా రూ.231 పెనాల్టీ కూడా కట్టాలని సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించారు. దీంతో 2013లో రాజన్ నాయర్ క్యాడ్బరీ కంపెనీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత మరో ఉద్యోగం దొరకడం కూడా ఆయనకు కష్టమైంది.
‘‘అన్నిటికీ సిద్ధమై ఉండాల్సిందే...''
స్కామ్లను బయటికి తేవడంలో విజిల్ బ్లోయర్ కంప్లెయింట్స్ చాలా కీలకం. విజిల్ బ్లోయర్లు సమాజంలో బయటికి కనిపించని హీరోలు అవుతున్నా.. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలను తట్టుకునేందుకు కూడా వారు సిద్ధంగా ఉండాలని షేర్హోల్డర్ అడ్వయిజరీ సంస్థ ఐఐఏఎస్ ఎండీ అమిత్ టాండన్ చెప్పారు. ఒక్కోసారి అక్రమాలు బయటపడ్డాక.. ఈ విజిల్ బ్లోయర్లు ఆ ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి మారి జీవించాల్సి వస్తోంది. ఒక్క ఉద్యోగానికే కాదు.. వారి ప్రాణాలకూ ప్రమాదం వాటిల్లవచ్చని ఆయన పేర్కొన్నారు.
రక్షణ చట్టం ఉన్నప్పటికీ...
కార్పొరేట్ ప్రపంచంలోని విజిల్ బ్లోయర్లకు రక్షణ కరవవుతోంది. కంపెనీలలో పని చేసే విజిల్ బ్లోయర్లను రక్షించేందుకు మన దేశంలో ‘విజిల్ బ్లోయర్ ప్రొటక్షన్ యాక్ట్ 2014'ను పార్లమెంటుఆమోదించింది. స్కామ్లను బయటికి తెచ్చిన ఉద్యోగుల పేర్లు, వివరాలు బయటికి పొక్కకుండా ఈ విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ సాయం చేస్తుంది. చట్టం అయితే ఉందికానీ అది అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఈ చట్టం అమల్లోకి రాకపోవడంపై.. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విజిల్ బ్లోయర్ రక్షణ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.