ఇన్ని నిబంధనలా? వ్యాపారానికి టైమేది?: కిరణ్ మజుందార్ షా
మన దేశంలో కంపెనీల నిర్వహణ, నిబంధనలకు సంబంధించి అమలవుతున్న నియంత్రణలపై బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం, నియంత్రణా సంస్థలు అతిగా ప్రవర్తిస్తున్నాయని, దేశంలో సులభతర వ్యాపారానికి ఇలాంటి వైఖరి ఏమాత్రం అనుకూలించదని ఆమె వ్యాఖ్యానించారు. నిజంగా దేశంలో వ్యాపారాన్ని సులువుగా చేసుకునేలా నిబంధనలు ఉన్నాయో లేదో ప్రభుత్వం, నియంత్రణాధికార సంస్థలు ఒకసారి సమీక్షించుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కంపెనీల నిర్వహణ అనే అంశంపై సెబీ మాజీ చైర్మన్ దామోదరన్ శుక్రవారం నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీల నిర్వాహకులకు వ్యాపారంపై దృష్టి పెట్టడానికి సమయం ఎక్కువగా ఉండడం లేదని, సమయంలో అధిక భాగం నిబంధనలు పాటించేందుకే సరిపోతోందని అన్నారు. తమ కంపెనీ విషయమే తీసుకుంటే.. వ్యాపార నిర్వహణకు సంబంధించి బయోకాన్ 1,567 నిబంధనలు పాటించాల్సి వస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య విశ్వాసం ఉండాలని, దురదృష్టవశాత్తూ అదే లోపిస్తోందని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. ప్రతి కంపెనీని ప్రభుత్వం అపనమ్మకంగా చూస్తోందని, ప్రతి వ్యాపారవేత్తను 'తప్పులు చేసేవాళ్లుగా' చూస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ''కార్పొరేట్ పాలన అంశాన్ని ప్రభుత్వం సమీక్షించాలి. అతి నిబంధనల వల్ల వాటిని పాటించడానికే సమయమంతా ఖర్చు అయిపోతోంది.. ఇక వ్యాపారాలను ఏం నడుపుతాం..'' అని అన్నారు.
కంపెనీల నిర్వహణ నైతిక నియమావళి వంటిదని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. వ్యాపారాలను ఎక్కడ? ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై ప్రభుత్వం, నియంత్రాణాధికార సంస్థలు నిష్పక్షపాతంగా ఆలోచించాలని సూచించారు. ఇదే సదస్సులో పాల్గొన్న టాటా సన్స్ బోర్డు మాజీ సభ్యుడు ఆర్ గోపాలకృష్ణన్ తన ప్రసంగంలో.. మజుందార్ షా అభిప్రాయాలను సమర్థించారు. నిబంధనలు, నియంత్రణలు ఏవైనా మన దేశ సంస్కృతికి అనుగుణంగా ఉండాలేగానీ.. అమెరికాలో సమర్థవంతంగా పని చేసే నియంత్రణలు మన దేశంలోనూ అదేమాదిరిగా చేస్తాయని అనుకోరాదని అన్నారు.