కావాల్సింది ఒకటి.. చేస్తోంది మరొకటి: బంగారంలాంటి అవకాశం మిస్!
భారత ఆర్థిక వ్యవస్థ కొంత కాలం క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ గా గుర్తింపు పొందింది. ఇప్పుడేమీ నానాటికీ దిగజారుతోంది. వరుసగా రెండు పర్యాయాలు యూపీఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రకరకాల ఆరోపణలతో సతమతం అయిపోయి ఆర్థిక వ్యవస్థ ను పట్టించుకోలేదని, ప్రజలు బీజేపీ అద్వర్యం లోని ఎన్డీయే కు ఓటేశారు. నరేంద్ర మోడీని ప్రధానిని చేసారు. ఆ సమయంలో అందరిలోనూ ఒక ఆశ. ఈ దేశం తప్పకుండా అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని, ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని అనుకున్నారు. కానీ మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ఏమో కానీ ... వణికించే నిర్ణయాలు తీసుకొన్నారు.
డిసెంబర్ 1 నుంచి కాదు.. ఫాస్టాగ్ గడువు 15 రోజులు పొడిగింపు
నోట్ల రద్దు తో మొట్టమొదటి సారి దేశాన్ని అతలాకుతలం చేసారు. అయినా సరే ఇదేదో దేశాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి చేసే నిర్ణయమేనని ప్రజలు అన్ని రకాల కష్టాలకు ఓర్చి మరీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇదే అదునుగా నరేంద్ర మోడీ కి మరో ఆలోచన తట్టింది. అనుకున్నదే మొదలు జీఎస్టీ ని దేశ ప్రజల మీద బలవంతంగా రుద్దారు. దీన్ని కూడా ప్రజలు ఆదరించారు. ఇలాగైనా దేశం బాగుపడుతుందేమోనని ఆశించారు. అందుకే అఖండ మెజారిటీ తో మరోసారి మోడీకి పట్టం గట్టారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు 9% నుంచి 4.5% నికి పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీంతో ఇప్పుడు జనాలు అందరూ అసలు ఈ ఎకానమీ కు ఏమైంది అని ఆందోళన చెందుతున్నారు.
పాతాళానికి జీడీపీ...
ప్రస్తుతం భారత దేశ జీడీపీ ప్రపంచంలో వేగంగా పడిపోతున్నదిగా గుర్తింపు సాధిస్తోంది. ఒక ఏడాది కాలంలోనే దాదాపు సగం వృద్ధి రేటు మందగించింది. తాజాగా ప్రకటించిన గణాంకాలను బట్టి చూస్తే... జులై - సెప్టెంబర్ త్రైమాషికంలో ఇండియా జీడీపీ వృద్ధి రేటు కేవలం 4.5% నికి పడిపోయింది. ఇది మరింతగా దిగజారే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఒక్కటి కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా కనిపించటం లేదని మెజారిటీ ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఎదో ఒకరిద్దరు ఆర్థికవేత్తలు మాత్రమే ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారు. మూడో త్రైమాశికం నుంచి జీడీపీ మళ్ళీ గాడిలో పడుతుందని, భారత ఆర్థిక వయవస్థ పరుగులు పెడుతుందని అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తే ఏమాత్రం అలా కనిపించటం లేదు. బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రమణ్య స్వామి మాత్రం దేశ అసలు జీడీపీ వృద్ధి రేటు కేవలం 1.5% మాత్రమేనని బాంబు పేల్చారు.
కావాల్సింది ఒకటైతే... చేస్తోంది మరోటి...
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుగా వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ పన్నులు తగ్గించి దీర్ఘకాలిక ప్రణాళికలవైపు దృష్టిసారించింది. భారీ ప్రోజెక్టుల కంటే ముందు చిన్న ప్రాజెక్టులు, వెంటనే పూర్తయ్యేవి చేపడితే ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రభుత్వ ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆర్థికంగా పుంజుకొనే చర్యలకంటే ఎమోషనల్ గా ఎక్కువమందికి దగ్గరయ్యే నిర్ణయాలపైనే ప్రభుత్వం ద్రుష్టి ఉందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.
బంగారం లాంటి అవకాశం మిస్...
అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు మన దేశానికి బంగారం లాంటి అవకాశం లభించింది. అమెరికాకు ఎగుమతులు పెంచి లబ్ది పొందాల్సి ఉంది. కానీ సంక్లిష్టమైన జీఎస్టీ వల్ల ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోయారు. అదే సమయంలో చైనా నుంచి కంపెనీలు తరలి పోతున్నప్పుడు వాటిని భారత్ కు రప్పించటంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొరుగునే ఉన్న బాంగ్లాదేశ్, నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా మనకన్నా మెరుగైన జీడీపీ వృద్ధి రేటుతో అభివృద్ధిబాటలో పయనిస్తుంటే ... ఇండియా మాత్రం ఒక్కో అడుగూ వెనక్కి వేళుతోంది.
పెండింగ్ లో రూ లక్షల కోట్ల బిల్లులు...
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గి పోయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఆధారపడేలా జీఎస్టీ చేసింది. దీంతో రాష్ట్రాలకు కూడా సొంత రెవిన్యూ మార్గాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సమయానుకూలంగా రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను చేయటం లేదు. దీంతో రాష్త్ర ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదు. అనధికార అంచనాల ప్రకారం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ 25 వేళ కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే ఇది కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎలా దేశం ముందుకు పోతుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తగిన చర్యలు తీసుకొని ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలని, లేదంటే పరిస్థితులు చేయి జారి పోయి ఆర్థిక మందగమనం కాస్తా... ఆర్థిక మాంద్యంగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు.