చైనాలో ‘5జీ’.. మరి మన దేశంలో ఇంకెప్పుడు?
చైనా ఒక్క వాణిజ్య రంగంలో మాత్రమే కాదు, సాంకేతిక రంగంలోనూ అగ్రరాజ్యం అమెరికాతో పోటీపడుతోంది. తాజాగా అత్యంత వేగవంతమైన '5జీ' మొబైల్ సేవలను సైతం చైనా ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని చాలా కొద్ది దేశాలు మాత్రమే ఈ '5జీ' సేవలను ప్రారంభించాయి. ప్రపంచంలోని మరికొన్ని దేశాలు కూడా 2020 నాటికి ఈ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.
చైనా కూడా మొదట 2020 కల్లా తమ దేశంలో '5జీ' మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించినా.. అనుకున్నదానికి ఏడాది ముందుగానే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. దీంతో ఇక ఈ '5జీ' సేవలు మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతాయనే ప్రశ్న వినిపిస్తోంది. నిజానికి ప్రపంచంలోని పలు దేశాలలతో పోల్చుకుంటే.. మన దేశంలో 3జీ, 4జీ మొబైల్ సేవలు కాస్త ఆలస్యంగానే మొదలయ్యాయి. అయితే ఈసారి జాప్యం జరగదని, 2020కల్లా మన దేశంలోనూ '5జీ' మొబైల్ సేవలు మొదలవుతాయని అంటున్నారు.
డ్రాగన్ కంట్రీలో తొలుత 50 నగరాల్లో...
వారం రోజుల క్రితమే చైనా తన దేశంలో ‘5జీ' మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ దేశానికి చెందిన మూడు టెలికాం కంపెనీలు.. చైనా మొబైల్, చైనా టెలికాం, చైనా యూనికామ్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. చైనాలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ‘చైనా మొబైల్'.. బీజింగ్, షాంఘై, షెంజాన్ తదితర 50 నగరాల్లో 5జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. దాని ప్రత్యర్థి కంపెనీలు ‘చైనా టెలికం', ‘చైనా యూనికామ్'లు కూడా ముఖ్య పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అక్కడ 5జీ డేటా ప్లాన్ ధరలు కూడా 128 యువాన్ల(దాదాపు రూ.1300) నుంచి 500 యువాన్ల(రూ.6 వేలు) వరకూ ఉన్నాయి.
ఏమిటీ ‘5జీ’ మొబైల్ నెట్వర్క్...
ప్రస్తుతం మన దేశంలో లభిస్తోన్న ‘4జీ'( నాలుగో తరం) మొబైల్ నెట్వర్క్కు అధునాతన అప్గ్రెడేషనే ఈ ‘5జీ' మొబైల్ నెట్వర్క్. దీనిని ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్గా కూడా పిలుస్తారు. ఈ నెట్వర్క్లో ఇంటర్నెట్ అప్లోడ్స్, డౌన్లోడ్స్ వేగం ఇప్పుడున్నదానికంటే అత్యంత వేగంగా ఉంటాయి. విస్తృతమైన కవరేజి, స్థిరమైన కనెక్షన్లు లభిస్తాయి. రేడియో స్పెక్ట్రమ్ను మరింతగా ఉపయోగించుకోగలగటం, ఏకకాలంలో ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైజ్లను మొబైల్ ఇంటర్నెట్కు అనుసంధానమయ్యే వీలు కలగడం ఇందులోని ముఖ్యమైన విషయాలు.
ఇప్పటి వరకు ఎన్ని ‘జనరేషన్లు’ అంటే...
ఫస్ట్ జనరేషన్(1జీ) మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినప్పుడు కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే చేయగలిగేవాళ్లం. దాని వేగం కూడా 1.9 కేబీపీఎస్(కిలోబైట్స్ పర్ సెకండ్) ఉండేది. ఆ తరువాత 2జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చాక కేవలం మాట్లాడుకోవడమేకాక.. ఇంటర్నెట్ ద్వారా ఎస్సెమ్మెస్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో ఇంటర్నెట్ వేగం 10 కేబీపీఎస్గా ఉండేది. ఆ తరువాత 3జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ నెట్వర్క్ వేగం 14.7 ఎంబీపీఎస్(మెగాబైట్స్ పర్ సెకండ్)కు పెరిగింది. దీంతో డేటా ట్రాన్స్ఫర్ అందుబాటులోకి వచ్చింది. ఫొటోలు, వీడియోలు పరస్పరం పంపుకోగలిగేవాళ్లం. ఇక ప్రస్తుతం ఉన్న 4జీ నెట్వర్క్ వేగం 60 ఎంబీపీఎస్. ఫలితంగా మ్యూజిక్ వినడం, వీడియోలు చూడటమేకాక వీడియో కాల్స్ కూడా చేసుకోగలుగుతున్నాం.
‘5జీ’ వల్ల ఏమిటీ ఉపయోగం?
5జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే.. ప్రపంచం సూపర్ ఫాస్ట్ స్పీడుతో పరుగులుపెడుతుంది. అయితే ఆరంభంలో మనకు అంత స్పీడు కనిపించకపోవచ్చు. ఎందుకంటే.. టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు మరింత స్థిరమైన కనెక్టివిటీ, సర్వీసులు అందించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకునే వరకు ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఈ 5జీ సేవలను కూడా ప్రారంభిస్తారు. పైగా 5జీ సేవలు ప్రారంభించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. స్పెక్ట్రమ్ కొనుగోలుతోపాటు కొత్త మాస్ట్లు, ట్రాన్స్మీటర్లు ఈ సేవలకు అవసరం అవుతాయి.
అసలు 5జీ నెట్వర్క్ అవసరమా?
ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే కొద్దీ డేటా వినియోగం అధికమవుతోంది. మ్యూజిక్ స్ట్రీమింగ్, వీడియో స్ట్రీమింగ్ పట్ల ప్రజాదరణ పెరిగే కొద్దీ డేటా వినియోగం ఏటేటా పెరిగిపోతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న స్పెక్ట్రమ్ బ్యాండ్లు ఇరుకవుతున్నాయి. ఫలితంగా మొబైల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఒక ప్రాంతంలోని ప్రజలు ఒకే సమయంలో ఆన్లైన్లోకి వస్తుండడం, మొబైల్ సర్వీసులను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సమస్య మరింత అధికమవుతోంది. 5జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ స్పీడు సూపర్ ఫాస్ట్ అవుతుంది కనుక ఈ సమస్య ఏర్పడదు. అందుకే అన్ని దేశాలు 5జీ సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
5జీ నెట్వర్క్ వచ్చాక ఎలా ఉంటుంది?
ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ద్వారా 1జీబీపీఎస్ (గిగా బైట్ పర్ సెకండ్) డౌన్లోడ్ స్పీడును అందుకోగలమని చెప్పుకుంటున్నా.. వాస్తవానికి సగటు వేగం 45 ఎంబీపీఎస్ మాత్రమే. అదే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ఈ డౌన్లోడ్ వేగం 10-100 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో బ్రౌజింగ్ వేగం అత్యధికంగా పెరుగుతుంది. ఒక హై డెఫినిషన్ సినిమాను ఒకే ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సాంకేతికత కారణంగా హై క్వాలిటీ వీడియో కాలింగ్, మొబైల్ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, డ్రైవర్ రహిత కార్ల వినియోగం, ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆధారంగా వివిధ గృహోపకరణాలను నియంత్రించడం వంటి ఎన్నో కొత్త సేవలు అందుబాటులోకి వస్తాయి. కమ్యూనికేషన్ రూపురేఖలు మారిపోతాయి. పారిశ్రామిక రోబోలు, డ్రోన్లు, సెక్యూరిటీ కెమెరాలు, టెలీ మెడిసిన్ వంటి వాటిని మరింత సమర్థంగా ఉపయోగించుకోగలుగుతాం.
మొబైల్ హ్యాండ్సెట్లు మార్చాల్సిందేనా?
తప్పదు. అయితే కొత్త తరం మొబైల్ హ్యాండ్సెట్లు.. 4జీ, 5జీ నెట్వర్క్ల నడుమ నిరాటంకంగా మారగలవు. తద్వారా మొబైల్ వినియోగదారులకు వారి నెట్వర్క్ కనెక్టివిటీ అనేది మరింత స్థిరంగా ఉంటుంది. గతంలో 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు.. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఆ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాక ముందే 4జీ మొబైల్ హ్యాండ్సెట్లు మార్కెట్లోకి వచ్చేశాయి. దీంతో ఆ హ్యాండ్సెట్లు వినియోగించిన వారు నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలతో బాధపడ్డారు. అయితే ఈసారి ఈ విషయంలో కంపెనీలు తొందర పడడం లేదు. ఇప్పటి వరకు వివిధ కంపెనీలు 18 రకాల 5జీ స్మార్ట్ఫోన్లను మాత్రమే విడుదల చేశాయి. చైనా కంపెనీ షావోమీ రెండు నెలల క్రితం రెండు 5జీ మోడళ్లను విడుదల చేయగా, హువావే తన మేట్ 30 సిరీస్ 5జీ మొబైల్ హ్యాండ్సెట్ విక్రయాలను ప్రారంభించింది.
ఏయే దేశాల్లో 5జీ ఉంది, వస్తోంది...
ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికాలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా చైనా కూడా 5జీ సేవలను ప్రారంభించింది. ఇంకా జపాన్, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, కెనడా, మెక్సికో, ప్యూర్టోరీకో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, పెరుగ్వే, ఖతార్, కువాయిట్, యూఏఈ, ఇండోనేషియా, టర్కీ, వియత్నాం, ఇరాన్, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, మలేసియా, పాకిస్తాన్, బహెరైన్, కజకిస్థాన్, శ్రీలంక తదితర దేశాలు 5జీ రేసులో ఉన్నాయి కానీ అవన్నీ ఆయా దేశాల్లో ఈ తరహా సేవలను ప్రారంభించేందుకు 2-5 ఏళ్లు పట్టవచ్చు. కొన్ని దేశాలు మాత్రం 2020కల్లా 5జీ సేవలను ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే చైనా టెలికాం అంచనాల ప్రకారం.. 5జీ సేవల విషయంలో చైనాయే అగ్రస్థానంలో ఉండబోతోంది. వచ్చే ఏడాదికల్లా చైనాలో 5జీ వినియోగదారులు 17 కోట్లకు చేరుకోనున్నారు. ఆ తరువాత 75 వేల మంది వినియోగదారులతో దక్షిణ కొరియా రెండో స్థానంలో.. 10 వేల మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉంటాయని అంచనా. ఇక మరో 5 ఏళ్లలో చైనా 60 కోట్ల మంది 5జీ వినియోగదారులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబడుతుందని భావిస్తున్నారు.
మన దేశంలో ‘5జీ’ సేవలు ఇంకెప్పుడు?
రిలయన్స్ జియో పుణ్యమాని డేటా వినియోగం విషయంలో ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక మన దేశం విషయానికొస్తే.. 2020 నాటికి మన దేశంలో కూడా ఈ 5జీ మొబైల్ నెట్వర్క్ సేవలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. దీనికోసం 2017 సెప్టెంబర్లోనే కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) ఒక అత్యున్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. చైనాలో 5జీ మొబైల్ నెట్వర్క్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన హువావే కంపెనీకి మన దేశంలోనూ 5జీ ప్రయోగాత్మక సేవలు ప్రారంభించడానికి గత నెలలోనే అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఓ వేదికపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంలో కొంత జాప్యం జరిగిందని.. అయితే 5జీ బస్సును మాత్రం మనం సకాలంలోనే అందుకుంటామని చెప్పారు.
సిద్ధమైన టెలికాం కంపెనీలు, కానీ...
మన దేశంలో 5జీ మొబైల్ నెట్వర్క్ ప్రయోగాత్మక పరీక్షల కోసం ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. నోకియా, ఎరిక్సన్, హువావేలతో కలిసి దరఖాస్తు చేసుకుని స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేచిచూస్తున్నాయి. అయితే ఈలోగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెండింగ్లో ఉన్న లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల కింద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డీవోటీ)కి భారతీ ఎయిర్టెల్ రూ.41 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.39 వేల కోట్లు చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కంపెనీలు షాక్ తిన్నాయి. తాము అంత డబ్బు చెల్లించలేమని, అదేగనుక జరిగితే తమ కంపెనీయే ప్రశ్నార్థకమవుతుందని, తమను ఆదుకోవాలంటూ ఇప్పటికే వొడాఫోన్ ఐడియా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. ఒకవైపు 2020కల్లా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుండగా, మరోవైపు డీలాపడిన కంపెనీలు 5జీ సేవల విషయంలో ఎంతవరకు ముందుకొస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.