ఆ దేశాలకు పెను సంక్షోభం: ఫారన్ వర్కర్స్ ఉపాధిపై కరోనా ప్రభావం ఎంతలా అంటే?
జనాభాపరంగా స్వదేశీయులను మించిపోయిన ప్రవాసులను వెనక్కి పంపే దిశగా కువైట్ అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. విదేశీయుల సంఖ్యను దశలవారీగా తగ్గించుకునేందుకు ఓ ముసాయిదాను కువైట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. ఇది చట్టంగా మారితే భారతీయుల్లో దాదాపు 8 లక్షల మంది స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. నైపుణ్యంలేని వారిపై ప్రభావం ఉంటుంది. మరోవైపు కరోనా కారణంగా ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా కారణంగా అమెరికా దెబ్బతిన్నది. దీంతో ఎన్నికల ముందు అమెరికా యువతకు ఉద్యోగ అవకాశల ప్లాన్లో భాగంగా నిలిపేశారు.
200 మంది ఉద్యోగులు, వారి కుటుంబాల్ని అమెరికా నుండి తీసుకొచ్చిన ఇన్ఫోసిస్
ఉపాధి కార్మికుల జీవితాలపై ప్రభావం
దేశంలో విదేశీయులను తగ్గించుకోవడం, కరోనా కారణంగా తమ దేశస్తులకు ఉద్యోగులు ఇవ్వాలని.. ఇలా వివిధ కారణాలతో ఇప్పటికే ఫారన్ వర్కర్స్ లేదా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన ఫారన్ వర్కర్స్పై కరోనా పెను ప్రభావం చూపిందని ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వలస కార్మికుల జీవితాలపై దుర్భరం చేశాయంటున్నారు. దీనికి తోడు కార్మికుల వసతి గృహాల నుండి పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఉపాధి కార్మికుల ఇబ్బందులెన్నో
కరోనా కారణంగా కార్మికులకు ఉపాధి లేక చేతులో డబ్బులు లేకుండా పోయాయి. చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేయాల్సి వచ్చింది. తిరిగి ఇంటికి (స్వదేశానికి) వెళ్లిపోదామంటే ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా బ్యాంకులు, మనీ ట్రాన్సుఫర్ కార్యాలయాలు మూసివేయడంతో డబ్బులు పంపించే వెసులుబాటు కూడా తగ్గింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతుండటంతో కాస్త ఊరట కలిగినప్పటికీ, కరోనా నేపథ్యంలో ఇదివరకటి కంటే ఇప్పుడు వారికి మరింత ఎక్కువ డబ్బు అవసరమయ్యే పరిస్థితి. కొంతమంది ఫారన్ వర్కర్స్ ఆన్ లైన్ బ్యాంక్ను ఉపయోగిస్తున్నారు.
ఉపాధి కోల్పోతే...
ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇది కోలుకోవడానికి ఆరు నెలల నుండి ఏడాది కూడా పట్టవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి ఆగని పక్షంలో ప్రపంచ ఆర్థిక మందగమనం, ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణిస్తే ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి.. ఇవి కోలుకోవడానికి చాలామందికి చాలా ఏళ్లు పట్టవచ్చునని చెబుతున్నారు. అది స్వదేశంలో కావొచ్చు.. విదేశంలో కావొచ్చు.. ఎక్కడ ఉపాధి లేదా ఉద్యోగం పొందాలన్నా ఏళ్లు పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు బదలీ తగ్గి
కరోనా కారణంగా ఆ కుటుంబాలు, ఆ దేశాలకు నగదు ట్రాన్సుఫర్ తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారు తమ కుటుంబాలకు, తమ దేశాలకు పెద్ద ఎత్తున డబ్బులు నగదు ట్రాన్సుఫర్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అరేబియన్ గల్ఫ్ నుండి పంపే డబ్బుపై ఆధారపడిన వారికి ఇది నిరుత్సాహం కలిగిస్తుంది. ఇప్పటికే చమురు అండ్ గ్యాస్ ధరల క్షీణత వల్ల ఆయా దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది అంతిమంగా ఉద్యోగులకు, విదేశాల నుండి వచ్చి ఉపాధి పొందుతున్న వారికి ఇబ్బందికరమే.
లెక్కలోకి వచ్చిన నగదు ప్రవాహం
కోట్లాదిమంది ఒక దేశం నుండి మరో దేశానికి వలస వెళ్లారు. ఆఫ్రికాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ వలసల్లో ఆఫ్రికా వాటా 70 శాతం. ఫారన్ వర్కర్స్ తమ దేశానికి పంపించే నగదు ప్రవాహం గత ఏడాది భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా 554 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎఫ్డీఐలు 540 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నగదు ప్రవాహం కూడా లెక్కల్లోకి వచ్చిందే. ఎందుకంటే వెనిజులాకు వెళ్లే నగదులో అన్నీ లెక్కలోకి రావు.
ఒకవేళ నగదు ప్రవాహం తగ్గితే
గత ఏడాది రికార్డ్ స్థాయికి చేరుకున్న నగదు ప్రవాహం 2020లో కరోనా వల్ల 20 శాతం లేదా 109 బిలియన్ డాలర్లు తగ్గితే 445 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతుంది. అంటే ఎఫ్డీఐ ఫ్లోలో 37 శాతం తగ్గుతుంది. కొన్ని దేశాలకు నగదు ప్రవాహం జాతీయ ఆదాయంలో మూడోవంతు ఉంది. కజకిస్తాన్, కిర్గిస్తాన్, నేపాల్, హియాతి, సోమాలియా వంటి దేశాలు ఇందుకు ఉదాహరణ. అంటే ఇలాంటి దేశాలు విదేశాల నుండి వచ్చే రెమిటెన్సెస్ తగ్గితే భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.