సొంత విమానాలు, బ్రాండ్, అప్పులు... ఎయిరిండియా కొనుగోలుతో బయ్యర్కు వచ్చేవేమిటి?
ఢిల్లీ: ఎయిరిండియాలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది. 2018లో 76 శాతం వాటా విక్రయం కోసం ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు కొన్ని విధానపరమైన మార్పులతో మొత్తం విక్రయిస్తోంది. ఈ మేరకు సోమవారం ప్రకటన జారీ చేసింది. ఎయిరిండియాతో పాటు అనుబంధ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి నిర్వహిస్తోన్న గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంయుక్త సంస్థ ఏఐఎస్ఏటీఎస్లోని 50% వాటా లను విక్రయించనుంది. అలాగే యాజమాన్య హక్కులను బదలాయించాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం తెలిపారు.
100% sale: ఎయిరిండియా కొనుగొలుకు మొగ్గు చూపేదెవరు?
విక్రయాల్లో ఇవి ఉండవు
ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్సుపోర్ట్ సర్వీసెస్, ఎయిర్లైస్ అలైడ్ సర్వీసెస్, హోటల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలను ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్కు బదలీ చేస్తారు. ప్రస్తుత విక్రయాల్లో ఇవి ఉండవు.
సొంత విమానాలు
ఎయిరిండియాకు 2019 నవంబర్ నాటికి 121 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా ఇందులో 65 సొంతం. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లు కలిపి ప్రస్తుతం 146 విమానాలు రన్ చేస్తున్నాయి. ఇందులో 82 సొంతవి. ఇవి రూపొంది ఎనిమిదేళ్లే. 27 బోయింగ్ 787 విమానాలు అయిదేళ్ల లోపువి. 27 ఎయిర్బస్ 320 నియో విమానాలు రెండేళ్ల లోపువి. అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి దేశీయ సంస్థల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లకు 51 శాతం వాటా ఉంది. విదేశీ సంస్థలతో కలిపి చూస్తే 18 శాతం.
ఉద్యోగుల ఖర్చు ఇలా..
56 జాతీయ, 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఎయిరిండియా విమానాలు నడుపుతోంది. ఈ రెండు సంస్థల ఆదాయం రూ.2018-19లో రూ.30,632 కోట్లు. దేశీయ విమాన సంస్థల్లో అత్యధిక ఆదాయం ఎయిరిండియాదే. ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు 11 శాతం. ఉద్యోగుల ఖర్చు శాతం మిగిలిన దేశీయ సంస్థలతో పోలిస్తే సమానంగా ఉంది. అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే తక్కువ.
కొనుగోలు చేసిన వారి చేతికి 'నష్టం'
2012 నుంచి ఎయిరిండియా పునరుద్ధరణకు దాదాపు రూ.30వేల కోట్లు సమకూర్చారు. కానీ నష్టాలు పెరుగుతున్నాయి. ఈ నష్టాలు రూ.60 వేల కోట్లు దాటాయి. ప్రయివేటు ఆపరేటర్లు అయితే సమర్థవంతంగా నిర్వహిస్తారని భావిస్తోంది ప్రభుత్వం. ఎయిరిండియా రుణాన్ని రూ.23,286 కోట్లకు ప్రభుత్వం పరిమితం చేస్తుంది. కొత్త పెట్టుబడిదారు ఈ భారం మాత్రమే భరించాలి.
ఉమ్మడి ఆస్తులతో సమానం
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ల ఉమ్మడి ఆస్తులకు ఇది సమానం. రూ.56,334 కోట్ల రుణాలు, రూ.17 వేల కోట్ల విలువైన ఆస్తులను ఏఐఏహెచ్ఎల్కు బదలీ చేస్తారు. చట్టబద్దమైన, ప్రభుత్వపరమైన బకాయిలు ప్రభుత్వం భరిస్తుంది.
ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్
కంపెనీలో దాదాపు 18వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి స్టాక్ ఆప్షన్ సదుపాయం ఉంది. మొత్తం షేర్లలో మూడు శాతం వాటాను వీరికి కేటాయించింది. నవంబర్ 1, 2019 నాటికి ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 17,984 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 9,617 మంది శాశ్వత ఉద్యోగులు.
పెట్టుబడిదారుకు ఇది బదలీ కాదు
ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన ఆర్థిక బారం ఎంత ఉంటుందనేది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ దశలో వెల్లడిస్తారు. కార్పోరేట్ గ్యారెంటీలను కొత్త ఇన్వెస్టర్కు బదలీ చేయరు. 9,617 మంది శాశ్వత ఉద్యోగుల్లో 36 శాతం మంది అయిదేళ్లలో పదవీ విరమణ చేస్తారు. డిప్యుటేషన్ పైన ఉన్న వారిని మినహాయిస్తే ఉద్యోగులు 16వేల మంది అవుతారు. ఉద్యోగులందరికీ రూ.1,383 కోట్ల బకాయిలను ఏఐఏహెచ్ఎల్ చెల్లిస్తుంది. ఎయిరిండియాలో 3 శాతం వాటాలను శాశ్వత ఉద్యోగులకు ఇస్తారు.
ఈవి బిడ్డింగ్ పరిధిలోకి రావు
ల్యాండ్, బిల్డింగ్స్ ఈ బిడ్డింగ్ పరిధిలోకి రావు. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లోని భవనాలు, కార్పోరేట్ ఆఫీసులను కొత్త యాజమాన్యం కొన్నాళ్లు ఉపయోగించుకునే వీలు కల్పిస్తారు.
బిడ్డింగ్కు అర్హత..
బిడ్డర్స్ నికర వ్యాల్యూ రూ.3500 కోట్లు ఉండాలి. గ్రూప్గా కొనుగోలు చేస్తే ప్రధాన బయ్యర్ కనీసం 26 శాతం వాటా, మిగతా సంస్థల్లో ప్రతి ఒక్కటి తప్పనిసరిగా కనీసం 10 శాతం వాటా కొనాలి. వీటి నికర వ్యాల్యూ రూ.350 కోట్లుగా ఉండాలి. అలా కాకపోయినా రూ.3500 కోట్ల నికర విలువ కలిగిన సంస్థను భాగస్వామిగా చేసుకుంటే దేశీయ విమానయాన సంస్థకు నికర విలువ లేకున్నా 51 శాతం వాటా కొనుగోలు చేయవచ్చు.
ఎయిరిండియా బ్రాండ్ కొనసాగించవచ్చు
కొనుగోలు చేస్తే ఎయిరిండియా బ్రాండ్ను కొనసాగించుకోవచ్చు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 11 వరకు అనుమానాలు అడిగితే, ఫిబ్రవరి 25వ తేదీలోపు ప్రభుత్వం సమాధానాలు ఇస్తుంది. మార్చి 17వ వరకు బిడ్స్ దాఖలు చేయవచ్చు. అర్హులకు మార్చి ఆఖరి వరకు సమాచారం ఇస్తారు.
ఎయిరిండియా బలం..
ఎయిరిండియా బలాలు... అతి పెద్ద నెట్ వర్క్, మౌలిక సదుపాయాలు, బ్రాండ్ నేమ్ కలిగి ఉండటం. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కలిపి మార్కెట్ వాటా ఎక్కువ కలిగి ఉండటం. రెండు ఎయిర్ లైన్స్ వద్ద మొత్తం 146 విమానాలు. దేశీయంగా 57, అంతర్జాతీయంగా 45 మార్గాల్లో సేవలు.