కొద్దిరోజుల్లోనే 'పడి'లేచిన బిలియనీర్లు, కరోనా టైంలోనూ వీరి సంపద ఎగిసింది..
కరోనా మహమ్మారి కాలంలో ఈ-కామర్స్ సహా వివిధ వ్యాపారాలకు డిమాండ్ పెరగడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి వాటిలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో కుబేరుల సంపద ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోను భారీగా పెరిగింది. ఈ-కామర్స్, టెక్, హెల్త్ స్టాక్స్ వైరస్ ఉన్నప్పటికీ లబ్ధి పొందాయి. దీంతో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి వారి సంపద ఎన్నో రెట్లు పెరిగింది. జూలై చివరి నాటికి ప్రపంచ బిలియనీర్ల సంపద మొత్తం కలిపి 10.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మేరకు స్విస్ బ్యాంకు యూబీఎస్, అకౌంటింగ్ దిగ్గజం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ స్టడీ వెల్లడిస్తోంది.
కుప్పకూలిన గ్రిడ్, చీకట్లో ముంబై మహానగరం: మార్కెట్లకు ఏ ఇబ్బందీ లేదు!
బిలియినీర్ల వద్ద ఉన్న సంపద ఎంత అంటే?
ఈ క్యాలెండర్లో ప్రపంచ కుబేరుల సంపద 10.2 ట్రిలియన్ డాలర్లకు పెరగడంతో 2017 సంవత్సరం నాటి రికార్డ్ 8.9 బిలియన్ డాలర్లను అధిగమించింది. జూలై చివరి నాటికి 2,189 మంది డాలర్ బిలియనీర్లను గుర్తించింది. 2017తో పోలిస్తే ఈ సంఖ్య 31 రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మన దేశం విషయానికి వస్తే డిజిటల్ ప్లాట్ఫాం దూకుడుతో పాటు పెట్టుబడులు వెల్లువెత్తడంతో ముఖేష్ అంబానీ వంటి వారి సంపద పెరిగింది.
ప్రజల ఇబ్బందుల్లో.. బిలియనీర్ల సంపద జంప్
కరోనా మహమ్మారి నేపథ్యంలో సెలెక్టివ్ రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, హెల్త్ కేర్, పారిశ్రామిక రంగాలు లాభపడ్డాయి. వినోదం, రియల్ ఎస్టేట్ రంగాలు మాత్రం దెబ్బతిన్నాయి. కరోనా సమయంలో సామాన్య ప్రజలు చేతిలోని డబ్బులు ఖర్చు పెట్టగా, మరికొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. కానీ బిలియనీర్ల సంపద మాత్రం ఊహించని విధంగా పెరిగింది. వ్యాపారులు, ఉద్యోగులు నష్టపోయారు. నిరుద్యోగంతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓ వైపు ప్రజలు, వ్యాపారులు నిరుద్యోగం, డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే బిలియనీర్ల సంపద పెరిగిందని బ్రిటన్ లేబర్ పార్టీ నేత ఏంజిలా రేనర్ ట్వీట్ చేశారు.
పడిలేచిన బిలియనీర్లు
ఈ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి మొదట బిలియనీర్లపై ప్రభావం చూపింది. ఈ వైరస్ ప్రారంభంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వీరి సంపద 6.6 శాతం మేర క్షీణించింది. మార్చిలో స్టాక్ మార్కెట్ పతనం కావడంతో బిలియనీర్ల సంపద కరిగిపోయింది. తర్వాత మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. ఏప్రిల్, జూలై చివరి నాటికి ఏకంగా 27.5 శాతం కోల్పోయిన సంపద తిరిగి వచ్చింది. ఆ తర్వాత మార్కెట్లు పుంజుకోవడంతో పాటు కొన్ని రంగాలు భారీగా ఎగిశాయి. దీంతో వారి సంపద పెరిగింది.
వీరి సంపద భారీగా పెరిగింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఆగస్ట్ మాసంలో 100 బిలియన్ డాలర్ క్లబ్లో చేరారు. ఈ కాలంలో టెస్లా షేర్లు భారీగా ఎగిశాయి. 2018, 2019, 2020 మొదటి ఏడు నెలల కాలంలో టాప్ 4 టెక్ సెక్టార్ బిలియనీర్ల సంపద 42.5 శాతం పెరిగింది. వారి నలుగురి సంపద 1.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.హెల్త్ సెక్టార్ విషయానికి వస్తే 50.3 శాతం పెరిగి బిలియనీర్ల సంపద 658.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.