5 ఏళ్ల క్రితమే ప్రమాదంలో ఆర్థిక వ్యవస్థ, మేమే కాపాడాం: నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను తాము కాపాడామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) యాన్యువల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. భారత్ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు వేస్తోందన్నారు.
జగన్ ప్రభుత్వం షాక్: అమరావతిలో ఆ ప్లాట్ల కేటాయింపు రద్దు
ప్రమాదంలో పడిన ఆర్థిక వ్యవస్థను కాపాడాం
ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని, దానిని తమ ప్రభుత్వం కాపాడుకుందని మోడీ ప్రకటించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని, ఈ వృద్ధి ఇప్పటికి ఇప్పుడు వచ్చిందని, గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితం అన్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా జీడీపీ పడిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అసాధ్యమని చెప్పారు కానీ...
తమ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లకుండా కాపాడటమే కాకుండా, ఇండియన్ ఎకానమీలో క్రమశిక్షణను తీసుకు వచ్చిందన్నారు. తాము భారత దేశాన్ని డిఫెకేషన్గా చేయాలనుకున్నప్పుడు చాలామంది అది అసాధ్యమని చెప్పారని, దానిని సాధించి చూపించామని, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అన్నారు.
హఠాత్తుగా జరగదు
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే హఠాత్తుగా జరగదని మోడీ అన్నారు. గత అయిదేళ్లలో భారత్ను మరింత స్ట్రాంగ్గా తయారు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలోని డిమాండ్స్, లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీలు కొన్ని గంటల్లో రిజిస్టర్ అవుతున్నాయన్నారు.
వారందరి గొంతూ విన్నాం
ప్రస్తుతం కేంద్రంలో రైతులు, కార్మికులు, పరిశ్రమలు, వ్యాపారులు... ఇలా అన్ని వర్గాల వారి సమస్యలు విని పరిష్కరించే ప్రభుత్వం ఉందని మోడీ అన్నారు. వారి సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాము జీఎస్టీని తీసుకు వచ్చామన్నారు. దానిని మెరుగుపరిచేందుకు వ్యాపారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ ముందుకు వెళ్తోందన్నారు.