భారత్లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, కఠిన సంస్కరణలు కష్టం: అమితాబ్ కీలకవ్యాఖ్య
న్యూఢిల్లీ: భారతదేశంలో కఠినమైన సంస్కరణలు అమలు చేయడం చాలా కష్టమైన అంశంగా మారిందని నీతి ఆయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్ అన్నారు. మన వద్ద ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉందని, అందుకే దేశ వృద్ధి కోసం చేసే కఠిన సంస్కరణలు కష్టమన్నారు. కానీ చైనా వంటి దేశాలకు పోటీనిఇచ్చేందుకు కీలకమైన, కఠినమైన సంస్కరణలు మరిన్ని అవసరమని అభిప్రాయపడ్డారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక చట్టాలు తెచ్చింది. ఇవి రైతులకు ప్రయోజనంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతుండగా, రైతుకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు డిసెంబర్ 8న భారత్ బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్ధమైంది. ఈ సమయంలో అమితాబ్ కాంత్ వ్యాఖ్యలు గమనార్హం.
జనవరి 1 నుండి టోల్ ప్లాజా వద్ద కొత్త నిబంధన, ఇక నగదుకు చెల్లు!
ధైర్యంగా కీలక సంస్కరణలు
కఠినమైన సంస్కరణలు భారత్లో కష్టతరమైనప్పటికీ, అలాంటి సంస్కరణలు చేపట్టడంలో ప్రభుత్వం ధైర్యం, చొరవ చూపిందని అమితాబ్ కాంత్ అన్నారు. మైనింగ్, బొగ్గు, లేబర్, వ్యవసాయ రంగం సహా వివిధ రంగాల్లో సంస్కరణలు చేపడుతోందన్నారు. భారత్లో వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవశ్యమన్నారు.
అయితే మండీలు, ప్రభుత్వ నియంత్రిత యార్డులను తొలగించడం లేదన్నారు. దీనిని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. మండీలను, యార్డులను తొలగించకుండానే రైతులు తాము నచ్చిన చోట విక్రయించేందుకు ప్రత్యామ్నాయాలు అందించే చర్యలు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిందని, దీంతో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.
రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాలి
వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కఠిన సంస్కరణలు చేసిందన్నారు. తదుపరి దశ సంస్కరణలను రాష్ట్రాలు ముందుకు తీసుకు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కఠినమైన సంస్కరణలు లేకుండా చైనా వంటి దేశాలకు మనం పోటీని ఇవ్వలేమన్నారు. డిస్కంల ప్రయివేటీకరణ చేయాలని కేంద్రపాలిత ప్రాంతాలను కోరామని, డిస్కంలు పోటీ ఇచ్చే విధంగా చౌక ధరలకు విద్యుత్ అందించాలన్నారు.
తయారీ హబ్గా భారత్
ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ వల్ల భారత కంపెనీల సత్తా ప్రపంచానికి తెలుస్తుందని అమితాబ్ అన్నారు. భారత్ తయారీ హబ్గా ఎదిగేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. స్వరాజ్య మేగజైన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో అమితాబ్ కాంత్ మాట్లాడారు.