ఈకామర్స్ కంపెనీల కొత్త టార్గెట్... ప్రధాన నగరాల్లో వాటికి పెరగనున్న డిమాండ్...
దేశంలో ప్రధాన నగరాలైన ముంబై,ఢిల్లీ,బెంగళూరు,చెన్నై వంటి నగరాల్లో భవిష్యత్తులో చిన్న గోదాములకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వస్తువులను బుక్ చేసుకున్న రోజే కస్టమర్లకు వాటిని డెలివరీ చేయాలని ఈకామర్స్ కంపెనీలు భావిస్తున్న నేపథ్యంలో చిన్న గోదాముల సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. రాబోయే 12 నెలల్లో 5000-10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాముల ఏర్పాటుకు డిమాండ్ పెరగవచ్చునని ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలరీస్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఏ వస్తువును కొనుగోలు చేయాలన్న ఎక్కువగా ఈకామర్స్ కంపెనీల పైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు 'సేమ్ డే డెలివరీ'ని ఈకామర్స్ సంస్థలు టార్గెట్గా పెట్టుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రధాన నగరాల్లో చిన్న సైజు గోడౌన్లను ప్లాన్ చేస్తున్నాయి.
భారత్లో కోవిడ్ 19 కంటే ముందే ఈకామర్స్ బిజినెస్లో చాలావరకు వృద్ది రేటు నమోదైందని,అయితే కరోనా పరిస్థితుల కారణంగా షాపింగ్ మాల్స్ మూతపడటంతో ఈకామర్స్కు మరింత డిమాండ్ పెరిగిందని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. కొత్త ట్రెండ్ని బట్టి చూస్తే నగరాల పరిధిలోని చిన్న గోడౌన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందన్నారు.
ప్రస్తుతం భారత్లో ఉన్న గోదాములన్నీ ఎక్కువ శాతం నగరాలకు దూరంగానే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు గూడ్స్ను డెలివరీ చేయడానికి కొద్దిరోజుల సమయం పడుతోంది. రవాణా భారం కూడా ఎక్కువే. అదే నగర పరిధిలోనే చిన్న సైజు గోదామును ఏర్పాటు చేసుకోగలిగితే... రవాణా భారం తగ్గుతుంది. అలాగే కస్టమర్కి చాలా త్వరగా డెలివరీ పూర్తి చేయవచ్చు.